వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో, ఆమె ఈ పిటిషన్ను దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలైన సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని ఆమె తన పిటిషనులో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారని ఆమె గుర్తుచేశారు.
ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టుకు విన్నవించారు.
అంతేకాకుండా, వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి, తొలుత ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత తనపైన, తన భర్త రాజశేఖర్ రెడ్డిపైన, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్పైన తప్పుడు కేసు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులే విచారణ జరిపి అది అసత్య కేసని తేల్చి తుది నివేదిక ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.