చంద్రబాబుకు రెండు నాలుకలు.. అపుడు అలా.. ఇపుడు ఇలా : జగన్ మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రెండు నాలుకలు ఉన్నాయని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులతో పాటు అన్ని వర్గాలవారిని దగా చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రెండు నాలుకలు ఉన్నాయని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులతో పాటు అన్ని వర్గాలవారిని దగా చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు మిర్చియార్డు సమీపంలో రెండు రోజుల రైతు దీక్షను ప్రారంభించి మాట్లాడారు.
ఈసందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నాయుడివంటి ముఖ్యమంత్రి పాలన ఎప్పుడు అంతమవుతుందా? అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ఎదురు చూస్తున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబును చూసి, ఈయనసలు ముఖ్యమంత్రేనా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని నిప్పులు చెరిగారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదని, ధరల స్థిరీకరణకు కనీస నిధిని కూడా కేటాయించలేదని గుర్తు చేసిన ఆయన, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మద్దతు ధర పెంచడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని, అందువల్లే రైతుల ఆత్మహత్యులు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు.
అన్నదాతలను ఆదుకుంటామని ఎన్నికల వేళ హామీలు గుప్పించిన ఆయన, ఓట్లు వేయించుకున్న తర్వాత రైతు గురించి ఆలోచించిన దాఖలాలు లేవని చెప్పారు. చంద్రబాబు రైతుల గోడు వినుంటే, తాను ఈ దీక్ష చేయాల్సిన అవసరం వచ్చేది కాదని చెప్పారు. కొంతకాలం క్రితం రూ. 15 వేలుగా ఉన్న మిర్చి ధర, పంట చేతికి వచ్చిన తర్వాత రూ.3 వేల వరకూ పడిపోతే, రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించిన ఆయన, వారిని ఆదుకునేందుకు కనీస చర్యలు కూడా ప్రభుత్వంచ చేపట్టలేదని ఆరోపించారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.4394 కోట్లు బకాయిలు పడ్డారు, పూర్తిగా ఎగనామం పెట్టారని, వరుసగా మూడేళ్లలో రూ.2306 కోట్లు, రూ.326 కోట్లు, రూ.1762 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారని ఆరోపించారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారనీ, రైతులు పొరపాటున ఆయన మాటలు వినకుండా పోతారోనని భయపడి ప్రతి గ్రామంలోను వాల్పోస్టర్లు, హోర్డింగులకు లైట్లు పెట్టి రాత్రిపూట కూడా కనిపించేలా పెట్టారన్నారు.
ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. మార్కెట్లో పోటీ సృష్టించాలి.. రైతులకు తోడుగా నిలబడేందుకు ఆయన రూ.8 వేలకు కొంటానన్నారు. అది తక్కువే అనుకున్నా, కనీసం ఆ రేటుకైనా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ పెరుగుతుంది. ఇపుడు ఆ పని కూడా చేయడం లేదన్నారు.