కారుకి ముసుగేసి లోపల ఏసీ వేసుకుని మద్యం సేవించారు. అనంతరం మత్తులోకి జారుకున్నారు. కారులో ఆయిల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మత్తులోకి పోయిన యువకులు ఊపిరాడక కారులోనే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతంలో జరిగింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతిలోని తిరుచానూరులో దిలీప్, వినయ్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించాలనుకున్నారు. ఐతే తాము మద్యం సేవించడాన్ని ఎవ్వరూ చూడకూడదని కారులో ఎక్కారు. ఐనప్పటికీ కారు అద్దల్లోంచి కనిపిస్తుండటంతో ఇద్దరూ కారు దిగి దానికి కవర్ వేసి కప్పేసారు. ఆ తర్వాత తిరిగి కారులోకి వెళ్లిపోయి ఏసీ ఆన్ చేసారు.
అనంతరం ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. మత్తులోకి జారుకున్నారు. కానీ అర్థరాత్రి దాటాక కారులో ఆయిల్ అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయింది. దీనితో పాటు ఏసీ కూడా ఆగిపోయి కారులో ఆక్సిజన్ లేకుండా పోయింది. ఫలితంగా వీరిద్దరూ గాలి ఆడక కారులోనే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.