Publish Date: Tue, 06 Feb 2024 (19:56 IST)
Updated Date: Tue, 06 Feb 2024 (19:59 IST)
వచ్చే ఎన్నికల్లో వైకాపా మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భయంకరపరిస్థితులతో పాటు అరాచకం ఏర్పడుతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అమరావతి రాజధానిపై యుటర్న్ తీసుకుని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకుని రావడం పెద్ద తప్పు అని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ను తిడితేనే వైకాపా పెద్దలు తమను నమ్మే పరిస్థితి ఉందన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్కే సాధ్యమన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "తాను వైకాపాలో చేరిన రోజే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా లేదా అని జగన్ను తాను ప్రశ్నించగా, తన ఇల్లు, ఆఫీసు కూడా ఇక్కడే కట్టానని, అందువల్ల ఇక్కడే ఉంటానని నమ్మబలికారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పాట మొదలు పెట్టారు. ఇది మాట తప్పడం, మడమ తిప్పడం కాదా?'' అని నిలదీశారు.
జగన్ పాలన ఇంకా కొనసాగితే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని, అందువల్లే తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూడు రాజధానులను తాను వ్యతిరేకిస్తే.. కొడాలి నాని, అంబటి రాంబాబు బెదిరింపు ధోరణితో మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ను దూషిం చాలని పార్టీ పెద్దలు పలుమార్లు తనపై ఒత్తిడి తెచ్చినట్టు చెప్పారు. ఆ పని చేయకపోవడం వల్ల తనను ఇబ్బందులకు గురిచేశారన్నారు. "ప్రతిపక్షనేతలను తిట్టని నిన్ను ఎలా నమ్మాలి అని.. సాక్షాత్తు జగనే వ్యాఖ్యానించారు" అని వసంత చెప్పారు.
ఠాగూర్
Publish Date: Tue, 06 Feb 2024 (19:56 IST)
Updated Date: Tue, 06 Feb 2024 (19:59 IST)