ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కించపరిచేలా వ్యాఖ్యానించిన వైకాపా మాజీ మంత్రి గోరంట్ల మాధవ్పై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్... ఆడవాళ్లకు అక్కా కాని, మగవాళ్లకు బావా కాని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి జడ్ కేటగిరీ భద్రతను కల్పించి, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
లోకేశ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత జి.నాగేశ్వర రావు తాడేపల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇదిలావుంటే ఒక్క రోజు వ్యవధిలోనే వైకాపాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై రెండు కేసులు నమోదు కావడం గమనార్హం. జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతుండగా పోలీసులు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు.
పోలీసుల వాహనాలను ఆపి కిరణ్పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాధవ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు కావడం గమనార్హం.