కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కొడితే కొట్టించుకోవాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు, నేతలకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వైకాపా కార్పొరేటర్లు, వివిధ స్థానిక సంస్థలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా... ఇపుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బందిపెట్టినా.. కొట్టినా వారి పేరు రాసిపెట్టుకోండి. ఎవరైనా కొడితే కొట్టించుకోండి. ఫర్వాలేదు. నీ టైమ్ బాగుంది కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అపుడు మనమూ కొడదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారెవరినీ వదిలిపెట్టం. రిటైరానా, దేశం వదిలిపోయినా లాక్కొస్తాం.. వారికి సినిమా చూపిస్తాం అంటూ అన్నారు.
'వైకాపా హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లో మినహా అన్నీ మనమే గెలిచాం. ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు' అని ఆరోపించారు.
ప్రతి నియోజకవర్గంలో పాత కేసులను తిరగదోడుతున్నారన్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసులు పెట్టారన్నారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే మరో కేసు... ఇలా రెండు నెలలుగా జైల్లోనే ఉంచారన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ను కూడా ఇదే విధంగా రెండు నెలలపాటు జైల్లో ఉంచారన్నారు. జైలుకు భయపడనివారే రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరన్నారు.