మహిళల బంగారం జోలికొస్తే మరో తెలంగాణ తరహా ఉద్యమం : కేసీఆర్
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతేకానీ, మహిళల బంగారం జోలికి వస్త
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతేకానీ, మహిళల బంగారం జోలికి వస్తే మాత్రం.. తెలంగాణ ఉద్యమం వంటి మరో ఉద్యమాన్ని నేనే తీసుకొస్తానని ఆయన ప్రకటించారు.
'పెద్ద నోట్ల రద్దు - రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ - ప్రజలపై ప్రభావం' అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. భవిష్యత్లో ఒక రూపాయి ఇచ్చేవాడు.. తీసుకునేవాడు ఉండడని, అంతా క్యాష్లెస్ కార్యకలాపాలకే మొగ్గుతారన్నారు. తద్వారా, అవినీతి రహిత సమాజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ప్రధాని మోడీ చర్యలు చాలా మందికి అర్థం కావడం లేదు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగదు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా కక్కించేందుకు ఆయన మరికొన్ని కఠిన చర్యలు తీసుకోనున్నారు. బంగారం అక్రమార్కుల పని కూడా పడ్తారు. బంగారం ఎన్నిరకాలో ప్రధానికి వివరించాను. దాంతో 'నీ వద్ద ఎంత బంగారం ఉంది?' అని ప్రధాని మోడీ అడిగారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1985లోనే ఆస్తులు ప్రకటించాను. నా వద్ద 115 తులాల బంగారం ఉందని నివేదిక సమర్పించానని కూడా చెప్పాను. త్వరలోనే గోల్డ్ డిక్లరేషన్ చేయాలని ప్రజల్ని కేంద్రం కోరుతుంది.
అయితే, కిలో వరకూ ఉన్న బంగారు ఆభరణాల జోలికి ప్రభుత్వం రాదు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో బంగారం ఉన్నవాళ్ల నుంచే లాక్కుంటుంది అని కేసీఆర్ వివరించారు. బంగారం తర్వాత బినామీ ఆస్తులపై కేంద్రం పడుతుంది. తమకున్న షేర్లు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. డిక్లర్ చేయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. డాలర్లపైనా, విదేశీ కరెన్సీపైనా దృష్టిపెడుతుంది. దీంతో మనీ లాండరింగ్ వంటివి తగ్గిపోతాయని కేసీఆర్ సభకు చెప్పుకొచ్చారు.