Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో విశాఖ అభివృద్ధి

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో విశాఖ అభివృద్ధి
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (11:09 IST)
న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను సీఎం వైయస్‌ జగన్ క‌లిశారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైయస్‌ జగన్, ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలిశారు. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలంటూ ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

 
దేశంలో విమానయాన రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవ, చేస్తున్న కృషికి సీఎం అభినందనలు తెలిపారు. విభజన తర్వాత విమానయానంతో సహా, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు సహకరిస్తామని 2014–రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. అటు ఆర్థికంగానూ, ఇటు అనుమతుల విషయంలో కూడా తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.
 
 
భౌగోళిక  పరిస్థితుల దృష్ట్యా పక్కనే తూర్పు నావికాదళం కేంద్రం ఉండడం, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేకపోవడంతో, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామ‌ని, రాష్ట్రానికి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అని సీఎం తెలిపారు.  రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైంద‌న్నారు.
 
 
భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి 3 ఏళ్లలో పూర్తి చేసే విధంగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా  సానుకూలంగా స్పందించార‌ని సీఎంఓ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలకలం : 12 మంది ఉద్యోగులకు పాజిటివ్