ఏపీలోని పల్నాడు జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం అర్థరాత్రి కొందరు దుండగులు దోపిడీకి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కాల్పులతో దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.
రైలు తుమ్మల చెరువు వద్దకు రాగానే ఓ ముఠా రైలులోకి ప్రవేశించి దోపిడీకి యత్నించింది. దీన్ని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగులను చెదరగొట్టేందుకు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో భయపడిపోయిన దొంగలు దోచుకోవడానికి తెచ్చిన వస్తువులను అక్కడే వదిలిపెట్టి ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా బీహార్, మహారాష్ట్రలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు రైళ్లలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడున్నట్టు పోలీసు అనుమానివిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ముఠ రెండుసార్లు దొంగతనాలకు పాల్పడ్డారని, శనివారం రాత్రి మూడోసారి దోపిడీకి ప్రయత్నించడంతో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పరారైన దండగుల కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.