Publish Date: Tue, 21 Jul 2020 (11:28 IST)
Updated Date: Tue, 21 Jul 2020 (11:29 IST)
తిరుమల శ్రీవారి భక్తులను బ్యాడ్ న్యూస్. శ్రీవారి దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం (జులై 21) నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది.
మళ్లీ టోకెన్లను ఎప్పుడు జారీ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆ కారణంతోనే టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఇప్పటికే ప్రకటించారు.
మంగళవారం నుంచి అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత వాహనాలకు కూడా అనుమతించమని.. ఈ ఆంక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.