Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ధర్మ రథం బస్సును హైజాక్ చేసిన దొంగ... బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో...

dharmaratham
, ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (14:15 IST)
తిరుమల గిరుల్లో తిరిగే శ్రీవారి ధర్మరథం బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. కొండపై భక్తులను అటూఇటూ చేరవేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. అలాంటి బస్సును ఓ దొంగ హైజాక్ చేశాడు. 
 
ఆదివారం తెల్లవారుజామున డిపోలో పార్క్ చేసిన బస్సును గప్ చిప్‌గా తీసుకెళ్లాడో దొంగ.. కొండమీద తిరగాల్సిన బస్సు తిరుపతికి వెళుతున్నా అలిపిరి గేటు వద్ద సెక్యూరిటీ పట్టించుకోలేదు. దీంతో ఆ దొంగ దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయిపోగానే బస్సు ఆగిపోయింది.
 
ఇక చేసేదేం లేక బస్సును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడా దొంగ.. డిపోలో ఉండాల్సిన బస్సు మాయం కావడంతో కొండపై అన్ని చోట్లా గాలించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జీపీఎస్ సాయంతో బస్సును ట్రాక్ చేయగా.. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు గుర్తించారు. 
 
దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. బస్సును ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఓవైపు కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా బస్సు చోరీ విషయం బయటపడడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, చోరీకి గురైన బస్సు విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో కొండపై తిప్పేందుకు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో రూ.2 కోట్ల విలువైన ఈ బస్సు రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ గెలుపు పాపంలో నాకూ భాగస్వామ్యం ఉంది : మోత్కుపల్లి నర్సింహులు