Publish Date: Fri, 24 Feb 2023 (08:54 IST)
Updated Date: Fri, 24 Feb 2023 (08:20 IST)
గన్నవరం వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించనున్నారు. వల్లభనేని అనుచరులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణలో ఈ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆఫీసు ప్రాంగణంలోని కార్లకు నిప్పు అంటించారు.
వైకాపా కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కార్యాలయాన్ని ఆయన పరిశీలించనన్నారు. అలాగే పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, గన్నవరం ఘటనపై చంద్రబాబు ఇప్పటికే బహిరంగ లేఖ ద్వారా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెల్సిందే
ఈ నెల 20వ తేదీన జరిగిన దాడిలో గన్నవరం టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పాటు ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటించారు. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెల్సిందే.