Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా రోగుల ప్రాణం తీసిన ప్రాణవాయువు .. 5 నిమిషాల ఆలస్యం కావడంతో...

కరోనా రోగుల ప్రాణం తీసిన ప్రాణవాయువు .. 5 నిమిషాల ఆలస్యం కావడంతో...
, మంగళవారం, 11 మే 2021 (08:01 IST)
తిరుపతిలో విషాదం జరిగింది. రాష్ట్రంలోనే మంచి పేరున్న రుయా ఆస్పత్రిలో కరోనా రోగులు పిట్టల్లా రాలిపోయారు.  ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు కరోనా వైరస్ అందక ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా ఈ సంఖ్య 11గా ఉండగా, అనధికారికంగా 25కు పైగా ఉన్నట్టు మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 
రుయా ఆస్పత్రిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న విభాగంలో ఆక్సిజన్‌ సరఫరాలో సోమవారం రాత్రి అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ వెల్లడించారు. 
 
చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారని, మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. వారి పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో తొలుత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలిని విసిరారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించారు.
 
మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అలాగే, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలోనూ లాక్ డౌన్ పెడితే బెటర్: సీఎం కేసీఆర్‌కి అభిప్రాయాలు