తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తితిదే పాలక మండలి కీలక సూచన చేసింది. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రత ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలందించడం దృష్ట్యా ఆగస్టు 15వ తేదీ నుంచి తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేసినట్టు పేర్కొంది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేస్తూ తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్టు తితిదే తెలిపింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్టాగ్ సౌకర్యం పొందాక మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తితిదే సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
అసీం మునీర్ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అల్ఖైదా మాజీ చీఫ్ బిన్ లాడెన్కు ఏమాత్రం తేడా లేదని, ఒక్క మాటలో చెప్పాలని మరో బిన్ లాడెన్... అసీం మునీర్ అని అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ సైన్యాధిపతి అసీం మునీర్... అణు బెదిరింపులకు పాల్పడిన విషయం తెల్సిందే. తమను నాశనం చేయాలని భావిస్తే తాము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడిన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. వీటిపై మైఖెల్ రూబిన్ ఘాటుగా స్పందించారు.
అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ బెదిరింపుల నేప్యంలో ఒక దేశంగా పాకిస్థాన్ దాని బాధ్యతలను నిర్వహించగలుగుతుందా అనే ప్రశ్నలు అనేకమంది ప్రజల్లో లేవెనెత్తుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అసీం మునీర్ ప్రవర్తన ఒసామా బిన్ లాడెన్లా ఉందని వ్యాఖ్యానించారు.
ఆయన మాటలను ట్రంప్ పరిపాలనాధికారులు వెంటనే ఖండించి.. దేశం నుంచి బహిష్కరించి ఉండాల్సిదని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరిస్తున్న పాక్.. చట్టబద్ధమైన దేశంగా ఉండే హక్కును కోల్పోయిందన్నారు.