Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా పొట్టకొట్టొద్దు సారూ అంటూ మిద్దెపై నుంచి దూకేసిన టీకొట్టు యజమాని..

crime scene
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో అధికారులు చేపట్టిన మురుగు కాల్వల పూడిక తీత పనుల్లో ఉద్రిక్త చోటుచేసుకుంది. తమ కుటుంబానికి జీవనాధారమైన టీ కొట్టును తొలగించవద్దంటూ ఓ టీకొట్టు యజమాని మిద్దెపైకి ఎక్కి కరెంట్ తీగలు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయన మిద్దెపై నుంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐస్‌ ఫ్యాక్టరీ కూడలి వద్ద మురుగు కాలువపై కొందరు దుకాణాలు పెట్టుకున్నారు. వీటితో కాలువలో పూడిక పేరుకుపోతోందని నగర పాలక సంస్థ అధికారులు బుధవారం జేసీబీతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
 
ఈ క్రమంలో తొలగింపునకు కనీస గడువు ఇవ్వకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని బాధితులు నగరపాలక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రెండో పట్టణ సీఐ లక్ష్మణరావు బాధితులకు సర్ది చెప్పారు. అదేసమయంలో టీ కొట్టు నిర్వాహకుడు సత్యనారాయణ తన షాప్‌ను అన్యాయంగా తొలగిస్తున్నారని, ఇటీవలే రేకులు వేసుకొని బాగు చేసుకున్నానని చెబుతూ అక్కడే ఉన్న దుకాణంపైకి ఎక్కాడు.
 
విద్యుత్తు తీగలను పట్టుకొనేందుకు యత్నించారు. వెంటనే అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేయించి, అతనితో మాట్లాడేందుకు చూశారు. పట్టించుకోని సత్యనారాయణ భవనం పైనుంచి దూకేశారు. గాయపడ్డ ఆయన్ని అధికారులు ఆసుపత్రికి తరలించారు. నిబంధనల మేరకే ఆక్రమణల్ని తొలగించామని టీపీవో మధుసూదనరావు తెలిపారు. కనీస గడువు ఇవ్వకుండా షాపులను తొలగించడం అన్యాయమని మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరింతమంది ఉద్యోగులను తొలగిస్తాం : సుందర్ పిచ్చాయ్