Publish Date: Fri, 11 Feb 2022 (07:08 IST)
Updated Date: Fri, 11 Feb 2022 (07:10 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అశోక్ బాబును ఏపీ పోలీసులు గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. బీకాం డిగ్రీ పూర్తి చేసినట్టు తప్పుడు ధృవపత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో ఈ అరెస్టు జరిగింది. అంతకుముందు ఆయన ఇంటివద్ద మఫ్టీలో గురువారం ఉదయం నుంచే పోలీసులు మకాం వేశారు. ఆ తర్వాత అర్థరాత్రి అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
కాగా, అశోక్ బాబు డిగ్రీ విషయంపై విజయవాడకు చెందిన మోహన్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెప్పించుకుంది. దీనిపై విచారణ జరపాలని లోకాయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో అక్కడకు వచ్చిన అశోక్ బాబును అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.
అశోక్ బాబు అరెస్టుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అర్థరాత్రి అరెస్టు చేయాల్సినంత నేరం ఆయన ఏం చేశారంటూ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ఆయన్ను వైకాపా ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలకు జగన్ ప్రభుత్వం భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.