Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు 120 కి.మీ వేగంతో వెళ్లిందా?

ఒడిశాలోని కటక్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తూ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపాన మంగళవారం వేకువజామున బ్రిడ్జిపై నుంచి కాలు వలో పడిపోయిన బస్సు... ప్రమాద సమయానికి ప్రభుత్వ అధికారులు సెలవిచ్చినట్లుగా 72 కిలోమీటర్ల వేగంతో కాకుండా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస

ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు 120 కి.మీ వేగంతో వెళ్లిందా?
హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (05:21 IST)
ఒడిశాలోని కటక్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తూ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపాన మంగళవారం వేకువజామున బ్రిడ్జిపై నుంచి కాలు వలో పడిపోయిన బస్సు... ప్రమాద సమయానికి ప్రభుత్వ అధికారులు సెలవిచ్చినట్లుగా 72 కిలోమీటర్ల వేగంతో కాకుండా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ బస్సులలన్నింటికీ బిగించే స్పీడ్ లాక్ వంటిది ప్రైవేట్ బస్సులకు అందులోనూ లగ్జరీ ట్రావెల్ బస్సులకు అస్సలు అమర్చరన్నది జగమెరిగిన సత్యమే. దీంతో రాత్రిపూట సకాలంలో బస్సును గమ్యస్థానానికి చే్ర్చాలనే తాపత్రయంలో గరిష్ట వేగంతో బస్సును నడుపుతారన్నదీ తెలిసిందే. 
 
ప్రవేట్ లగ్జరీ బస్సుల వేగం కనీసం 80 కిలోమీటర్లు. గరిష్ట వేగం 120 కిలోమీటర్లు. లారీ డ్రైవర్లకు మించిన దూకుడుతో డ్రైవర్లు చెలరేగిపోవడానికి ప్రవేట్ బస్సులకు స్పీడ్ లాక్ ఉండకపోవడమే కారణం అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రవేట్ బస్సుల తీరుతెన్నులెలా ఉన్నాయో అర్ధమవుతుంది. ప్రైవేటు బస్సులు వాయు వేగంతో దూసుకుపోతున్నా, ఒక బస్సుకు పర్మిట్‌ తీసుకుని ఆ ముసుగులో మూడు నాలుగు బస్సులు నడుపుతున్నా పాలకులకు పట్టదు.
 
కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతులు తీసుకోవడం, స్టేజ్‌ క్యారియర్లుగా తిప్పడం సర్వసాధారణమైపోయింది. ఎక్కడబడితే అక్కడ ప్రయాణికుల్ని ఎక్కించుకో వడం, ఆ జాప్యాన్ని అధిగమించడం కోసం పెను వేగంతో పోవడం రివాజు. ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు కాంట్రాక్టు క్యారియర్‌గా ఉంది. మృతుల వివరాలు చూస్తుంటే వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడల్లో ఎక్కిన వారుగా తేలింది. నిబంధనలేమీ పాటించలేదని దీన్నిబట్టే అర్ధమవుతుండగా ఇంతవరకూ యాజమాన్యంపై కేసే పెట్టలేదు! కనీసం బస్సు నడిపినవారికి  లైసెన్స్‌ ఉందో లేదో చూసే దిక్కయినాలేదు. ఈ బస్సు టీడీపీ ఎంపీది కనుక నిజాలను కప్పెట్టేం దుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
 
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 32మందినీ సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రులకు తరలించి కాపాడాలన్న స్పృహ కూడా అధికార యంత్రాంగానికి లేకపోయింది.  గాయపడినవారంతా తెల్లారుజామునుంచి మధ్యాహ్నం వరకూ బస్సులోనే ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తూ ఉండిపోయారంటే ప్రభుత్వం, అధికారుల అలసత్వాన్ని ఏమనాలి. 
 
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్‌ ఏ స్థితిలో ఉన్నాడన్నది కీలకమవుతుంది. అతడు సజీవంగా ఉంటే తాగి ఉన్నాడో లేదో తేల్చాలి. ప్రస్తుత ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మరణించాడు గనుక పోస్టుమార్టమే ఏకైక మార్గం. మరి దాన్ని దాటేసే ప్రయత్నం ఎందుకు జరిగింది పోస్టుమార్టం అయిపోయిందని కలెక్టర్‌ ఎలా చెప్పగలిగారు ఒకవేళ డాక్టర్‌ చెప్పినట్టు పోస్టుమార్టం ఇంకా నిర్వహిం చకపోతే అతడి మృతదేహాన్ని ఎందుకు మూటగట్టారు అసలు నిబంధనల ప్రకారం ఉండాల్సిన రెండో డ్రైవరైనా సక్రమంగా ఉన్నాడో లేదో, అతనికి లైసెన్స్‌ ఉందో లేదో ఎందుకు తెలుసుకోలేదు   
 
ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా దివాకర్‌ ట్రావెల్స్‌పై కేసు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం వివరించగలదా? ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు అధికారుల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా ఉంటే నిలదీసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రతిపక్ష నేతకు అది మరింతగా ఉంటుంది. ప్రమాదం జరిగిన బస్సు తన పార్టీ ఎంపీది కనుక అడ్డగోలుగా వ్యవహరిస్తానంటే చెల్లదు. ప్రైవేటు బస్సు యాజమాన్యాల ఆగడాలను అరికట్టి, పౌరుల ప్రాణాలను కాపాడటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే జనం చూస్తూ ఊరుకోరు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రానికి చేరిన ఓటుకు కోట్లు కేసు చార్జిషీట్: గజగజ వణుకుతున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు