Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అద్దంకి వాసి... కాబోయే సి.జె. కూడా!

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అద్దంకి వాసి... కాబోయే సి.జె. కూడా!
విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:19 IST)
సుప్రీం కోర్టుకు కాబోయే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ప్ర‌కాశం జిల్లా అద్దంకి వాసి. ఆయ‌న ఇపుడు సుప్రీం న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం,  జ‌స్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ. ఆయ‌న  ప్రకాశం జిల్లా జె.పంగులురు మండలం అలవలపాడు గ్రామ వాసి. ఆయ‌న నిన్ననే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిస్ నరసింహ, న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తి కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుత సీనియారిటీ ప్రకారం 2027 అక్టోబర్ నుండి మే 2028 వరకు 8 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే గొప్ప అత్యున్నత అవకాశం కూడా దక్కనుంది.
 
న‌ర‌సింహ తండ్రి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన స్వర్గీయ జస్టిస్‌ పమిడిఘంటం కోదండరామయ్యకు  న్యాయవర్గాల్లో మంచి పేరు ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్‌ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడానికి ఢిల్లీ వచ్చిన ఆయన పట్టభద్రుడయ్యాక దేశరాజధానిలోనే ప్రాక్టీసు కొనసాగించారు.
 
1990 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న నరసింహ 2014-2018 మధ్య నాలుగేళ్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఉన్నారు. అయోధ్యలో రామమందిరం అనుకూలంగా కేసు వాదించిన ప్యానెల్ లో ఆయన ముఖ్యుడు. అలాగే 15 సంవత్సరాలు లిటిగేషన్‌లో ఉన్న బి.సి.సి.ఐ కేసులో అమికస్‌ క్యూరీగా వ్యవహరించి 145 గంటలపాటు చర్చించి, అందర్నీ ఒప్పించి దాని పరిపాలనకు సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఆయనకెంతో పేరు తెచ్చింది. ఇవాళ క్రికెట్ ని శాసిస్తున్న  బి.సి.సి.ఐ ఇంత బలంగా ఉండడానికి కారణం ఆయనేనంటే అతిశయోక్తి కాదు! ఇంత‌టి ప్ర‌జ్నాశాలి మ‌న ఆంధ్రుడు కావడం, పైగా ఆయ‌న‌కు సి.జె. కాగ‌ల అవ‌కాశాలుండ‌టం అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.
 
సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా PS నరసింహ అనేక పర్యావరణ, అటవీ చట్టాలకు సంబంధించి పలు కేసులు కూడా వాదించారు. పర్యావరణ, అటవీ బెంచ్‌కు అమికస్‌ క్యూరీగా 3 సంవత్సరాలు ఉన్నంతకాలం ముఖ్యమైన పర్యావరణ, అటవీ చట్టాలు, గిరిజన హక్కుల రూపకల్పనలో శ్రీనరసింహ ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు కేసులో కూడా అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన కీలక వాదనలు చేశారు.
 
అలవలపాడు గ్రామానికి చెందిన వీరి పూర్వీకులు శ్రీరామభక్తులు. నరసింహా తాతగారికి అద్దంకి మండలం మోదేపల్లిలో కూడా కొంత భూమి ఉండడంతో ఆ గ్రామంలో స్థిరపడ్డారు. జస్టిజ్ నరసింహ తాతగారి సోదరులు (పెద్ద తాత గారు) శ్రీరామభక్త పమిడిఘంటం వెంకటరమణ దాసు భద్రాచలంలో అంబా అన్నదాన సత్రం (అలవలపాటి వారి సత్రం) ను నెలకొల్పి భద్రాచలం వచ్చే రాములవారి భక్తులకు విశిష్ట సేవలందించారు. ఇటీవల దేవస్థానంవారు దీనిని పునర్నిర్మించారు. ఈ సత్రానికి భక్తులు కొన్ని వందల ఎకరాల భూములు విరాళంగా ఇచ్చారు. ఇటీవల వరకు నరసింహ తండ్రి మాజీ హైకోర్ట్ జడ్జీ పమిడిఘంటం కోదండరామయ్య ఈ సత్రం ట్రస్టిగా సత్రం వ్యవహారాలు చూసేవారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రస్తుతం ఈ సత్రాన్ని శ్రీ భారత తీర్ధ మహాస్వామి వారి పీఠానికి అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మలా సీతారామన్‌తో బుగ్గన భేటీ, ఆన్ రాక్ కంపెనీ వివాదంపైనే!