Publish Date: Mon, 17 Dec 2018 (12:59 IST)
Updated Date: Mon, 17 Dec 2018 (13:00 IST)
స్మార్ట్ఫోన్లు మంచి ఎంతవరకో కానీ.. నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లను అందరూ తెగ వాడేస్తున్నారు. ఇంకా చిన్నారులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లను అతిగా వాడేవారిలో యవత్ ముందున్నారు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేందుకు చిన్నారులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ కోసం అక్కాచెల్లి గొడవ పడ్డారు.
ఈ గొడవలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఈ పట్టణానికి చెందిన కంభం దామోదర్ రెడ్డి.. ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుచిత డిగ్రీ తొలి సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ విషయంలో చెల్లెలు హాసినితో సుచితకు వివాదం తలెత్తింది.
గమనించిన తండ్రి దామోదర్ రెడ్డి.. పెద్ద కుమార్తెను మందలించాడు. పరీక్షలు దగ్గరపడుతుండగా ఫోన్ కోసం జగడం ఎందుకని హితవు పలికాడు. దీంతో పెద్ద కుమార్తె సుచిత ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోసం ఎంత వెతికినా.. లాభం లేకపోయింది. కాగా.. ఆదివారం ఉదయం రైలు పట్టాలపై సుచిత శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.