విశాఖ కంచరపాలెంలోని స్థానిక కప్పరాడ ఎస్టీ వసతి గృహంలో చదువుతున్న బి.రాజ్ కుమార్ మృతికి నిరసనగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇందుకై నగరంలోని కలెక్టర్ కార్యలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామానికి చెందిన విద్యార్థి బి.రాజ్కుమార్ నగరంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాలలో బిఏ రెండో ఏడాది చదువుతున్నాడు. అక్కడ వసతి గృహంలోనే ఉంటున్నాడు. అయితే వారం రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. దీంతో విద్యార్ధి మృతి పట్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారం రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నా సకాలంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంలో వసతి గృహం వార్డెన్ విఫలమయ్యారన్నారు. విద్యార్థి మృతదేహాన్ని వసతి గృహానికి తీసుకురాకుండా నేరుగా అతని వూరుకు తీసుకెళ్లిపోయారన్నారు. వసతి గృహంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, మరుగుదొడ్లు బాగోలేవని, వసతి సౌకర్యాలు అంతంతమాత్రమేనని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రధానంగా గిరిజన, విద్యాశాఖ మంత్రి రాజీనామాలు చేయాలని, మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.