Publish Date: Fri, 22 Feb 2019 (12:19 IST)
Updated Date: Fri, 22 Feb 2019 (12:19 IST)
నేరచరిత్ర కలిగిన వారిని ఏపీ ముఖ్యమంత్రే పక్కన పెట్టుకున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇంట్లో బాంబు పేల్చిన కోడెల శివప్రసాద్, గన్ పేల్చిన బాలకృష్ణ టీడీపీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. విపక్ష నేత, వైకాపా అధినేత జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఏపీ సీఎం చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. బాబుకు ఇటీవలి కాలంలో అసహనం పెరిగిపోతుందని.. అందుకే హీరో నాగార్జున జగన్ను ఎందుకు కలిశారని ఆరా తీస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు అయి జగన్పై కేసులు పెట్టాయని ఆమె విమర్శించారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే జగన్ విచారణకు హాజరవుతున్నారని స్పష్టం చేశారు. ఈ కేసుల నుంచి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని విచారణకు హాజరుకాని ముద్దాయి చంద్రబాబు అని రోజా మండిపడ్డారు.
పనిలో పనిగా టీడీపీ నేతలను కూడా రోజా ఏకిపారేశారు. దేశంలో మహిళలను వేధించిన నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోనే ఉన్నారని రోజా విమర్శించారు. రౌడీ చింతమనేనికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయన్ను ప్రజలపైకి వదిలేశారని దుయ్యబట్టారు.