Publish Date: Tue, 21 Dec 2021 (20:07 IST)
Updated Date: Tue, 21 Dec 2021 (20:10 IST)
నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఐదు మండలాల ఇన్ఛార్జ్లు ఒక్కతాటిపై నిలబడి రోజాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతుంటే రోజా మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే సిఎం జన్మదిన వేడుకల్లో ఇది కాస్త ఒక్కసారిగా బయటపడింది.
రోజా నగరి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటూ ఉంటే రోజా ప్రత్యర్థి వర్గం మొత్తం పుత్తూరులో వేడుకల్లో మునిగితేలారు. వడమాలపేట, పుత్తూరు, నగరి, విజయపురం, నిండ్ర మండలాలకు చెందిన వైసిపి ఇన్ ఛార్జ్ లు, కార్యకర్తలు కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు.
అయితే ఈ వేడుకల్లో ప్రత్యర్థి వర్గం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజానే తమను దూరం చేసుకున్నారని.. తాము పార్టీకి కట్టుబడి ఉన్నామని.. పార్టీ కోసం పనిచేస్తున్నామని చెబుతున్నారు.
గతంలో నాన్ లోకల్ వ్యక్తికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా ఈ సమస్య తలెత్తిందంటున్నారు. రోజా నాన్ లోకల్ కావడం.. రెండుసార్లు ఆమెను గెలిపించామని చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం తమలో ఒకరికే టిక్కెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను సిఎం ముందు పెడతామని.. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్లు రోజా ప్రత్యర్థి వర్గం నేతలు చెబుతున్నారు.