Publish Date: Fri, 11 Jun 2021 (10:07 IST)
Updated Date: Fri, 11 Jun 2021 (10:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు మారాయి. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది.
మారిన వేళల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
గురువారం వరకు ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకునేందుకు.. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండేది. అయితే, కరోనా కేసులు తగ్గడంతో మరో రెండు గంటల పాటు సమయాన్ని ప్రభుత్వం పెంచింది.
ఫలితంగా శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు అమలు అవుతోంది. ఈ నెల 20 వరకూ ప్రభుత్వ ఆదేశాలు అమలుకానున్నాయి. ఏపీలో అమలు చేస్తున్న కఠిన కర్ఫ్యూ మంచి ఫలితమిస్తోంది. కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.