అమరావతిలో రియల్ బాంబ్... రూ.15 వేల కోట్లు మటాష్
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిని నమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిలో వేల కోట్లు డంప్ చేశారు. ఇపుడు ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో రియల్ బాంబ్ పేలింది. పది వేల కోట్లకు పైగా వ్యాపారం కుప్పకూలింది. అమరావతి చుట్టు పక్కల ఎక్కడ చూసినా
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిని నమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిలో వేల కోట్లు డంప్ చేశారు. ఇపుడు ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో రియల్ బాంబ్ పేలింది. పది వేల కోట్లకు పైగా వ్యాపారం కుప్పకూలింది. అమరావతి చుట్టు పక్కల ఎక్కడ చూసినా ఎకరా కనీస ధర రూ.5 కోట్లకు తక్కువ లేదు. ఈ మధ్య అయితే, కొందరు రియల్టర్లు ఎకరా 20 కోట్లకు కూడా కొన్నారు. కానీ, ఇపుడు నోట్ల మార్పిడితో, ధరలు అమాంతం 70 శాతానికి పడిపోయి... పెట్టుబడులు పెట్టిన రియాల్టర్లు వేలాది కోట్ల రూపాయలకు నిండా మునిగిపోయారు.
ఎకరాల కొద్దీ ప్లాట్ల రూపంలో క్రయవిక్రయాలకు ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్సులు ఇచ్చి కూర్చున్న వ్యాపారులకు ఇపుడు ముందు నుయ్యి, వెనక గొయ్యి కనపడుతోంది. కొద్ది గంటల తేడాలో రియల్ ఎస్టేట్ సౌధాలు కుప్పకూలిపోయాయి. చాలా వ్యాపారాల్లాగే రియల ఎస్టేట్ కూడా ప్రధానంగా నల్లధనంపైనే ఎక్కువగా ఆధారపడింది. చేసుకున్న ఒప్పందాల్లో కొద్ది మొత్తం మాత్రమే వైట్ మనీగా చెలామణి అవుతుంది. మిగతా మొత్తం అంతా నల్లధనమే. అందులోనూ ఒప్పందాల సమయంలో రైతులకు ఇచ్చుకున్న కోట్లాది రూపాయల విషయం ఇక చెప్పనక్కర్లేదు. అదంతా లెక్కలో లేని నల్ల ధనమే.
మరీ నెలల క్రితమే జరిగిన ఒప్పందాల విషయంలోనైతే ఇటు డబ్బులు ఇచ్చుకున్న వ్యాపారస్తులే కాదు అటు పుచ్చుకున్న రైతులు కూడా భారీగా నష్టపోయారు. దాంతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని రైతులు రియల్టర్లపై ఒత్తిళ్ళు పెడుతున్నారు. తాము తీసుకున్న డబ్బుకు అదనంగా ఎంతో కొంత వేసి తిరిగి ఇచ్చేస్తామని రైతులు అంటున్నారు. అయితే, ఇచ్చిన అడ్వాన్సులను తిరిగి తీసుకోవటానికి రియల్ వ్యాపారులు అంగీకరించటం లేదు.
ఎందుకంటే, తీసుకున్న అడ్వాన్సులను రైతులు ఇంకా తమ ఇళ్ళలోనే ఉంచుకున్నారు. అవీ పాత 500, 1000 నోట్లు. ఇపుడా డబ్బును బ్యాంకుల్లో జమ చేయాలంటే లెక్కలు చెప్పాలి. బయట చెల్లుబాటు కాక బ్యాంకులకు లెక్కలు చెప్పలేక రైతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. తమకు ఇచ్చిన అడ్వాన్సును తిరిగి తీసుకోవాల్సిందిగా రైతులు ఒత్తిడి తెస్తుండటంతో రియల్ ఎస్టేట్ వర్గాలకు దిక్కుతోచటం లేదు. ఇక్కడి అమరావతి వ్యాపారంలో ఎన్ఆర్ఐలు కూడా మునిగిపోయారు.