రాజ్యసభ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. గురువారం 52 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరికి వీడ్కోలు కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్యసభ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ ముగియగా, ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ ఓటింగ్ జరిగే అవకాశం లేకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నిజానికి పార్లమెంట్ ఉభయ సమావేశాలు ఈనెల 13 వరకు జరగాల్సి ఉంది. అయితే బిజినెస్ ఏమీ లేనందున బుధవారం లోక్సభ నిరవధికంగా వాయిదా పడనుంది. రాజ్యసభలో పైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతోంది. దీనిని సభ ఆమోదించిన తర్వాత.. ఆ బిల్లును లోక్సభకు పంపిస్తారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్సభను నిరవధిక వాయిదా పడుతుంది.
అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ ముగిసింది. దీనిపై ఓటింగ్ మాత్రమే జరగాల్సి ఉంది. రాజ్యసభ నిరవధిక వాయిదా పడటంతో వచ్చే సమావేశాల్లోనే బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెల్సిందే.