Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రాహ్మణుల పేదరికాన్ని రూపుమాపాలి: కమలానందభారతి స్వామిజీ

బ్రాహ్మణుల పేదరికాన్ని రూపుమాపాలి: కమలానందభారతి స్వామిజీ
, సోమవారం, 2 నవంబరు 2020 (06:49 IST)
దేశంలోని బ్రాహ్మణుల పేదరికాన్ని రూపుమాపేందుకు అన్ని బ్రాహ్మణ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని ప్రముఖ పీఠాధిపతి కమలానందభారతి స్వామిజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ‘బ్రాహ్మణ జాతి అభివృద్ధి, శ్రేయస్సు’ అంశంపై జాతీయ, రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం వన్‌టౌన్‌లోని కన్యకారమేశ్వరి అన్నసత్రం కల్యాణమండపంలో జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన కమలానందభారతీ స్వామిజీ మాట్లాడుతూ... దేశంలో ఒకనాడు  విద్యా, సామాజిక రంగాల్లో అత్యున్నతస్థాయిలో ఉన్న బ్రాహ్మణులు నేడు అట్టడుగు స్థాయికి దిగజారారన్నారు. దేశానికి వచ్చిన పాశ్చాత్యుల ప్రభావానికి అధికంగా ప్రభావితమైనది బ్రాహ్మణులేనన్నారు.

అందువలనే విద్యా, కుల ఆచారాలకు దూరంగా జరిగారని చెప్పారు. అంతేకాకుండా నేడు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ బ్రాహ్మణులు ఒకరిద్దరు తమ ఉనికిని చాటుతున్నారే తప్పా సరైన స్థానాన్ని పొందలేకపోతున్నారన్నారు. సమాజంలో అత్యంత పేదరికాన్ని బ్రాహ్మణులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లోని బ్రాహ్మణుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు.  బ్రాహ్మణులు పేదరికం నుంచి దూరం కావటానికి, రాజకీయంగా ఎదగటానికి అవసరమైన కార్యచరణను అందరూ కలిసి రూపొందించకొని ముందుకు సాగాలని సూచించారు. బ్రాహ్మణుల పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతూ సమాజంలో ఉన్నతస్థాయికి ఎదగటానికి అవసరమైన కార్యచరణకు బ్రాహ్మణ సంఘాల పాటుపడాలన్నారు.

ప్రభుత్వానికి బ్రాహ్మణుల దుస్థితిని వివరించి పూర్తిస్థాయిలో సాయం పొందేందుకు కృషి చేయాలన్నారు. అందుకు అందరూ ఐక్యంగా లౌక్యంగా ముందుకు సాగాలన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లోనూ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలన్నారు.

మహిళలకు వైఎస్సార్‌ చేయూత పేరుతో అందిస్తున్న సహకారాన్ని బ్రాహ్మణులకు కూడా వర్తింపజేయాలన్నారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయిలో పటిష్టపరిచి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా పురోహితాన్ని బ్రాహ్మణుల కులవృత్తిగా గుర్తించాలన్నారు.

నామినెటేడ్‌ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పలు అంశాలపై సమావేశం తీర్మానాలను చేసింది.

ఈ కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్‌శర్మ, కోశాధికారి అడవి వెంకటకృష్ణ, పరశురామ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా సుధాకర్, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌ శ్రీనివాసు, ఏపీ పురోహిత సమాఖ్య అధ్యక్షులు యమిజాల నరసింహమూర్తి, అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు బండారు సుదర్శన శర్మ తదితరులు ప్రసంగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్