Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ వరదలపై స్పందించిన ప్రధాని మోడీ... సీఎం బాబుకు ఫోన్

pmmodi

ఠాగూర్

, సోమవారం, 2 సెప్టెంబరు 2024 (10:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో సంభవించిన వరదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయ చర్యలను సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి వివరించారు. అందుకు ప్రధాని మోడీ స్పందిస్తూ... ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి పంపాలని ఆదేశించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీఎం చంద్రబాబు 
 
విజయాడలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం రాత్రి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు స్వయంగా ఆహారం అంజేశారు. ఆయన బాధితుల పరిస్థితి చూసి చలించిపోయారు. ఆ తర్వాత ఆయన విజయవాడ కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. 
 
ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేపు కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. తద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు.
 
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వస్తోందని వివరించారు. మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోందని చెప్పారు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీళ్లు విజయవాడకు వచ్చాయని వెల్లడించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు మండిపడ్డారు.
 
వరద బాధితులు సుమారు 2.76 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇవాళ సింగ్ నగర్ లో వరద బాధితుల కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు.
 
రాష్ట్రానికి రేపు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు వస్తున్నాయని వెల్లడించారు. సహాయ చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించామని అన్నారు. సహాయ చర్యలను రాత్రిపూట కూడా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, సమాచారం కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీఎం చంద్రబాబు