తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మంచి శుభవార్త చెప్పారు. నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు.
విజయవాడ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు.
మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పల్లపు సురేశ్ అనే ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటన గ్రామంలో స్పర్థలకుదారితీసింది. రాజకీయ లబ్దికోసం ఆలోచించేవారు ఇలాంటి గొడవలు పెద్దవి చేస్తారని, తాము మాత్రం సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేస్తామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్ళించారని పవన్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ అన్నార. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ, కాకినాడ సబ్ కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.