Publish Date: Mon, 15 Aug 2022 (16:14 IST)
Updated Date: Mon, 15 Aug 2022 (16:16 IST)
తనకు పదవులపై ఆశ ఉన్నట్టయితే తాను ఎపుడో ఎంపీ అయివుండేవాడినని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే... ముఖ్యమంత్రి జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సందర్భంగా ఆయ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇష్టానుసారం మాట్లాడేవారికి తాను కూడా జవాబు చెప్పగలనన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపరని విమర్శించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలు బలోపేతం అవుతాయన్నారు. రాజకీయాల్లో మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క తేలుస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని పవన్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. గుడివాడలో ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోందని చెప్పారు. పార్టీని నడిపే సత్తా వైసీపీకే ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలంతా ఈసారి జనసేనకు మద్దతివ్వాలని కోరారు. తాను పదవినే కోరుకుని ఉంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని చెప్పారు.