ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం జాతీయ-సాంస్కృతిక ఐక్యతకు దోహదపడదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను హిందీ భాషకు వ్యతిరేకం కాదని, దానిని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.
హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే తప్పుడు సమాచారం వ్యాప్తిని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 భాషను తప్పనిసరి చేయలేదని పేర్కొన్నారు. "NEP-2020 కింద హిందీని విధించడం గురించి తప్పుడు కథనాలను సృష్టించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం" అని ఆయన ఆరోపించారు.
NEP-2020 కింద, విద్యార్థులు తమ మాతృభాషతో సహా ఒక విదేశీ భాష, రెండు భారతీయ భాషలను నేర్చుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడని వారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాష నుండి ఎంచుకోవచ్చు.
NEP-2020 లోని బహుభాషా విధానం విద్యార్థులకు ఎంచుకునే స్వేచ్ఛను అందించడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొన్ని రాజకీయ గ్రూపులు ఉద్దేశపూర్వకంగా తమ అజెండాల కోసం విధానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తాను తన వైఖరిని మార్చుకున్నానని వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు.
"ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా నేను నా స్థానాన్ని మార్చుకున్నానని చెప్పడం అవగాహన లేకపోవడాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. జనసేన పార్టీ భాషా స్వేచ్ఛ, ప్రతి భారతీయుడికి విద్యా హక్కు సూత్రాలకు కట్టుబడి ఉంది" అని పవన్ స్పష్టం చేశారు.