Publish Date: Fri, 09 Aug 2019 (16:52 IST)
Updated Date: Fri, 09 Aug 2019 (16:53 IST)
హైదరాబాద్ వంటి నగరం ఏపీకి లేదని, తమది పేద రాష్ట్రమని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. భారత విదేశాంగ శాఖ సమన్వయంతో విజయవాడలో జరుగుతున్న డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు యూఎస్ఏ, యూకే, కెనడా, జపాన్, కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా 35 దేశాల హైకమిషనర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని, అలా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. ఏపీలో 4 నౌకా పోర్టులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఏపీకి అపారమైన కోస్తా ప్రాంతం ఉందన్నారు. టెండర్ల నుంచి కేటాయింపుల దాకా అవినీతి రహిత నిర్ణయాలను తీసుకుంటున్నామని జగన్ అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సు నిర్వహణకు సహకరించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.