Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో కోటి మొక్కలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో కోటి మొక్కలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
, బుధవారం, 11 డిశెంబరు 2019 (22:04 IST)
ఓ ఉన్నతమైన ఆశయం... సమాజ హితమే ఆకాంక్ష... పర్యావరణ పరిరక్షణే ధ్యేయం... పచ్చదనం కాపాడే పెద్ద ప్రయత్నం... అందుకు కార్యాచరణ సిద్దం అయ్యింది. ఇప్పుడు అంధ్రదేశమంతటా లక్షలాది మొక్కలు నాటే మహోధ్యమానికి నాంది ఏర్పడింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వం వహించనుంది. తొలి కార్యక్రమం ఘన విజయం సాధించింది. ఇందుకు బీజం వేసింది మరెవరో కాదు, స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగాధినేత, రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. 
 
వృక్షో రక్షితి రక్షితహ అన్న ఆర్యోక్తి మన కందరికీ తెలిసిందే. అయితే ఆదిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఈ క్రమంలో గవర్నర్ తనదైన స్పందన కనబరిచారు. స్వయంగా రంగంలోకి దిగారు. గవర్నర్ హోదాలో తానే అధ్యక్షునిగా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీని ఇందుకు సిద్దం చేసారు. తొలి ప్రయత్నం అబ్బుర పరిచింది. ఆహా అనిపించింది. కార్యక్రమ భాగస్వాములతో పాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీడియాలో  వీక్షిస్తున్న వారిలోనూ స్పూర్తిని నింపింది.
 
వేలాది మంది విద్యార్ధులు...  లక్షలాది మొక్కలు... విజయవాడ లయోలా కళాశాల ప్రాంగణం హరిత హారమే అయ్యింది. ఒకే సారి లక్ష మొక్కలు , ఐదెకారాలకు పైగా విస్త్రీర్ణంలో కళకళ లాడాయి. కనువిందు చేసాయి. బుధవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ స్వయంగా తొలి మొక్కను నాటారు. అప్పటికే సిద్దం చేసిన గుంతలలో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్ధులు మొక్కలతో రంగంలోకి దిగారు. తాము నాటిన మొక్క వంక మురిపెంగా చూసుకున్నారు. ఎవరికి వారు, ప్రతి ఒక్కరూ ఆ మొక్క తమదన్న భావన కనబరిచారు.  రాష్ట్ర ప్రధమ పౌరునితో కలిసి తాము సైతం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అయ్యామన్న ఆనందం వారిలో కనబడింది. ఇది వారిలో ఉత్తేజాన్ని నింపింది. మరోవైపు రాజ్యాంగాధినేత మాటలు వారిని ఆలోచింపచేసాయి. కార్యోన్ముఖులను చేసాయి. ఇప్పుడే కాదు, మరెప్పుడైనా, ఇంకెక్కడైనా ... తమ బాధ్యతను మరువరాదన్న ఆలోచన వారిలో స్థిరంగా నాటుకు పోయింది.
 
ప్రధాని మోది పిలుపు మేరకు ఇది ఒక మహోధ్యమంగా సాగాలన్నది గౌరవ గవర్నర్ బిశ్వ భూషణ్ ఆలోచన. సేవే ప్రధాన భూమికగా ఏర్పడిన రెడ్ క్రాస్ యంత్రాంగాన్ని వేదికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని విజయవాడలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా స్పష్టమైన కార్యాచరణ సిద్దం చేయాలని గవర్నర్ వారి కార్యదర్శి, రెడ్ క్రాస్ సొపైటీ ఉపాధ్యక్షులు ముఖేష్ కుమార్ మీనాను గవర్నర్ ఆదేశించారు. 
 
కేవలం రెడ్ క్రాస్ మాత్రమే కాకుండా గవర్నర్ స్వయం పర్యవేక్షణలో ఉండే విశ్వ విద్యాలయాలు, రాష్ట్ర సైనిక సంక్షేమ సంఘం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రాష్ట్ర క్షయ నివారణ సంఘం, ఆంధ్రప్రదేశ్ సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్,   రాష్ట్ర కుష్టు నివారణ సంఘంల సేవలు సైతం వినియోగించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. కార్యక్రమం నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ కాలుష్య కోరల నుండి ఈ దేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.
 
కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో వారం రోజులకు పైగా విద్యాసంస్ధలు మూసి వేసారంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని, దీనికి విరుగుడు మొక్కల పెంపకం మాత్రమేనని బిశ్వ భూషణ్ స్పష్టం చేసారు. రానున్న మూడు సంవత్సరాల కాలంలో కోటి మొక్కలను నాటటమే ధ్యేయంగా ముందడుగు వేయనున్నామన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరం, కార్యదర్శి డాక్టర్ ఇండ్ల రవి, నగర ప్రముఖులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అయితే నేటి యువత అకాంక్షలను సైతం గవర్నర్ కాదనలేదు. వారి కోరిక మేరకు విద్యార్ధులతో కలిసి సెల్పీలు దిగారు. అందరికీ అవకాశం దక్కేలా ప్రోత్సహం అందించారు. ఈ పరిణామం వారికి జీవితకాలపు అనుభవాన్ని మిగిల్చిందనటంలో సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ