Publish Date: Tue, 02 Nov 2021 (16:55 IST)
Updated Date: Tue, 02 Nov 2021 (16:57 IST)
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఈ గెలుపుపై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా స్పందించారు. విజేతగా నిలిచిన డాక్టర్ సుధకు అభినందనలు తెలిపారు. బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు అంటూ ఓ వీడియో సందేశం అందించారు.
'జగనన్నపై అభిమానంతో 2019లో 45 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపిస్తే, నేడు జగనన్న పాలన చూసి 90550 ఓట్ల మెజార్టీని అందించారు. జగనన్న సుపరిపాలనకు ప్రజలందరూ మద్దతు పలుకుతున్నారన్న విషయం ఈ గెలుపు మరోమారు తేటతెల్లం చేసిందన్నారు.
ఈ రోజు చంద్రబాబునాయుడికి సూటిగా చెబుతున్నాం. కుప్పంలో నీ వాగుడు చూశాం, నీ డ్రామాలు చూశాం. ఇప్పటికైనా తెలిసిందా... ఏ సెంటర్లో అయినా, ఏ టైమ్లో అయినా, ఏ ఎలక్షన్లో అయినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండ్తో అన్ని పార్టీలను మట్టి కరిపిస్తారు.
బద్వేలులో పోటీ చేయబోమని చెప్పిన మీరు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్నందరినీ చితకబాది తరిమికొట్టారంటే జగనన్న పవరేంటో అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా... మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బద్వేలు ప్రజలు తీర్పునిచ్చారని రోజా జోస్యం చెప్పారు.