Publish Date: Mon, 18 Jan 2021 (10:12 IST)
Updated Date: Mon, 18 Jan 2021 (10:13 IST)
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
మరోవైపు, ఉదయం 9 గంటలకు రసుల్పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు నిర్వహించిన అమరజ్యోతి ర్యాలీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొన్నారు. 10 గంటలకు ఎన్టీఆర్ భవన్లో లెజండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను తెలంగాణ తెలుగుదేశం ఏర్పాటు చేసింది.
ఇంకోవైపు, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ జీవించివున్న సమయంలో అంటే 1980లో నాటి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జనసామాన్యంలో విస్తృతంగా రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. పాతుకుపోయిన వ్యవస్థల మీద యుద్ధం చేశారు. రాజకీయాల్లో నాయకీయత చొప్పించారు.
ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. కేంద్రం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటిపైకి తెచ్చారు. ఫలితంగా 1989లో నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు.