Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం అవినీతిపై ఇంకా నివేదికను కేంద్రానికి పంపలేదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం అవినీతిపై ఇంకా నివేదికను కేంద్రానికి పంపలేదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
, సోమవారం, 29 జూన్ 2020 (18:49 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నివేదిక పంపలేదని కేంద్రం చెబితే.. పోలవరంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి- రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని ఓ వర్గం మీడియాలో టీడీపీ ప్రచారం చేసుకోవడం బాధాకరమని ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

ఆ నివేదిక వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో మొత్తం బయటకు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

సోమవారం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 
"పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎక్స్ పర్ట్ కమిటీని వేశాం. దానిపై విజిలెన్స్ నివేదిక ఇంకా రాలేదు. అందుకే కేంద్రానికి ఇంకా సబ్ మిట్ చేయలేదు. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుకు కేంద్రం కూడా ఇదే సమాధానం చెప్పింది.

దీన్ని తెలుగుదేశం పార్టీ, ఆ వర్గం మీడియా తమకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకుంటుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. పనిలో పనిగా పోలవరంతోపాటు పట్టిసీమను కూడా కలిపేసుకుని అందులో కూడా అవినీతి జరగలేదని ఓ వర్గం మీడియా రాసింది. ఇది ముమ్మాటికీ తప్పు.

పట్టిసీమలో రూ. 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ నివేదికలోనే బట్టబయలైంది. దానిని కూడా దాచిపెడతారా..?" అని మంత్రి ప్రశ్నించారు.  మా ప్రభుత్వం వచ్చాక.. రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి.. పోలవరంలో ఇప్పటికే రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపారు.

పైగా తెలుగుదేశం నేతలు పోలవరం కాంట్రాక్టును మా వాళ్ళకు కట్టబెట్టామని మాట్లాడుతున్నారు.. తెలుగుదేశం హయాంలో నామినేషన్ల పద్ధతిలో పనులు కేటాయించి నిధులు దుర్వినియోగం చేస్తే.. మేం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదా చేయటం అంటే మా వాళ్ళకు కేటాయించడం ఎలా అవుతుందని..? అని నిలదీశారు.

ఎవరైనా తమ వాళ్ళకు కాంట్రాక్టులు కేటాయించాలనుకుంటే..  ఒక రూపాయి ఎక్కువ ధరకు పనులు కేటాయిస్తారు. అదే నిజమైతే.. మీరు గతంలో రూ. 800 కోట్లు ఎక్కువకి నవయుగకి పనులు కట్టబెట్టారని అంగీకరిస్తారా.. అని ప్రశ్నించారు. ఈ విధంగా చంద్రబాబు హయాంలో రూ. 800 కోట్లు దోపిడీ చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు మెదడు మోకాళ్ళలో ఉందో.. అరికాళ్ళలో ఉందో అర్థం కావటం లేదని అనిల్ కుమార్ ఘాటుగా విమర్శించారు. 

చంద్రబాబు హయాంలో కేటాయించిన పనుల కంటే.. రూ. 800 కోట్లు ఆదా చేస్తే.. అది నీతి అవుతుందా..? అవినీతి అవుతుందా? అని ప్రశ్నించారు. ఇదికాకుండా.. చంద్రబాబు నాయుడు హయాంలో.. పోలవరం ప్రాజెక్టు పనులను తమకు కావాల్సిన వారికి నామినేషన్ పద్దతిలో పనులు కట్టబెట్టి వెయ్యి.. రెండు వేల కోట్లు కొట్టేశారని మంత్రి చెప్పారు. 
 
20 శాతం పూర్తి చేసి.. 70 శాతం పూర్తైందంటారా..?
నోరు తెరిస్తే.. చంద్రబాబు నాయుడు, ఆయన హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు 70 శాతం పూర్తి చేశామని పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతున్నారని మంత్రి చెప్పారు.

రూ. 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రూ. 17 వేల కోట్లు ఖర్చు పెట్టి.. 70 శాతం పూర్తైందని ఏ విధంగా చెబుతారని మంత్రి నిలదీశారు. కేవలం 20 శాతం పూర్తి చేసి.. 70 శాతం అని ప్రచారం చేసుకోవడం టీడీపీకే చెల్లిందని దుయ్యబట్టారు. 

గత ప్రభుత్వం ఐదేళ్ళలో నిర్వాసితులకు సంబంధించి ఒక్క ఇల్లును కూడా మార్చకుండా.. నిద్రపోయారని మంత్రి అనిల్ ఘాటుగా విమర్శించారు. ఐదేళ్ళూ మీరు నిద్రపోయి.. ఈ సీజన్ లో పనులు జరగలేదని, సీజన్ వేస్ట్ చేశామని మా మీద నిందలు వేయటం సిగ్గుమాలిన పని అని అన్నారు. 

కరోనా వేళ ఎక్కడైనా ఎలా పనులు జరుగుతాయా అని ప్రశ్నించారు. అప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి.. కరోనా సమయంలోనూ 50 శాతం వరకూ పనులు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు మాత్రం కరోనా పేరుతో బయటకు రావాలంటేనే భయపడిపోతూ.. ఇంట్లో దాక్కుని, జూముల్లో ప్రెస్ మీట్లు పెడతారు.. వీరికి ఒక న్యాయం.. కార్మికులకు మరో న్యాయమా.. ఏమిటీ ద్వంద్వ వైఖరి..? అని మంత్రి ప్రశ్నించారు. 
 
పోలవరం మేమే కట్టి.. జాతికి అంకితం చేస్తాం..
పోలవరం ప్రాజెక్టు ఎవరు పూర్తి చేస్తారో.. ఎవరు నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తారో.. రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో చూస్తారని మంత్రి అన్నారు. పోలవరం అంటే ఒక డ్యామ్ కాదు.. దానితో పాటు 1.10 లక్షల కుటుంబాలు అని కూడా మా ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

మాకు ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. లక్షా పది వేల మంది నిరాశ్రయులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం.. అని ఏదైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పారో..  ఆవిధంగా రూ. 33 వేల కోట్లతో వారికి పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే 17 వేల కుటుంబాలు మార్చబోతున్నాం. వారికి పునరావాసం కల్పించబోతున్నాం.

కాఫర్ డ్యామ్ నిర్మించే లోపల ఈ 17 వేల కుటుంబాలను జులై నెలాఖరుకు లేదా ఆగస్టు మొదటి వారానికి మార్చబోతున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని చెప్పారు.

గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. కనీసం అవగాహన లేకుండా గోదావరికి 50 లక్షల ఫ్లడ్ వస్తుందని మాట్లాడుతున్నాడని, వాస్తవానికి 37-38 లక్షలు మాత్రమే ఇప్పటివరకూ రికార్డు ఉందని తెలిపారు. 

నోరు తెరిస్తే.. అనుభవం లేని వాళ్ళం అని మాట్లాడుతున్నారని.. మీరు అనుభవంతో ఏం ఉద్దరించారని ప్రశ్నించారు. అనుభవం లేకపోయినా.. యువకులం, చదువుకున్నవాళ్ళం కాబట్టి.. ప్రతి పనినీ సమర్థవంతంగా చేస్తూ.. ప్రభుత్వానికి డబ్బు ఆదాతో పాటు ప్రజలకు మంచి చేస్తున్నామని చెప్పారు.

మిగతా అన్ని ప్రాజెక్టులను జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టులకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక‌పై 'రైతు దినోత్సవం'గా వైయస్ జ‌యంతి