Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవరత్నాలా.. నవ గ్రహాలా?: సాకే శైలాజనాథ్

నవరత్నాలా.. నవ గ్రహాలా?: సాకే శైలాజనాథ్
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:33 IST)
పేదలకు పక్క ఇళ్ళు ఇస్తామంటున్న ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో పది శాతం కూడా పూర్తి చేయలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజానాథ్  విమర్శించారు. నవరత్నాలు నవగ్రహాలుగా రాష్ట్రానికి పట్టాయని, దసరా నాటికి గృహ ప్రవేశాలు జరుపుతామన్న ప్రభుత్వం ఇంటి నిర్మాణం పునాదులు కూడా దాటలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే పక్క ఇళ్ళు నిర్మించి ఇందిరమ్మ గృహాలు పంపిణీ జరిగిందని, తరువాత వాటి గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. అసలే అప్పులు తెచ్చి కాలం వెళ్లదీస్తున్న సర్కారు పేదలకు పక్కా ఇల్లు ఎప్పుడు ఇస్తుందని శైలజానాథ్ ప్రశ్నించారు.

శుక్రవారం ఆంధ్ర రత్న భవన్  నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  వైసీపీ ప్రభుత్వం పేదల ఇంటికి ఇస్తోంది కేవలం రూ.30వేలు అని, వాటి ని కూడా ఉపాధి హామీ నిధులకు ముడిపెట్టేసిందన్నారు.  అంటే గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం ఒక్కో ఇంటికి ఇచ్చేది అక్షరాలా సున్నా. పీఎంఏవై కింద కట్టే ఈ ఇళ్లకు కేంద్రం మూడు దఫాలుగా నిధులు మంజూరుచేస్తుంది.

తొలి విడతలో 40శాతం(రూ.60వేలు), రెండో విడతలో 40శాతం(రూ.60వేలు), మూడో విడతలో 20శాతం(రూ.30వేలు) మొత్తం రూ.లక్షన్నర విడుదల చేస్తుంది.

ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడత, అంతకముందు నిధులు అన్నీ కలిపి రూ.3700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేసిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1700 కోట్లు మాత్ర మే వాస్తవంగా ఇళ్లకోసం వినియోగించిందని, ఇళ్ల బిల్లులతో పాటు సిమెంట్, స్టీలు కొనుగోలు అవసరాలకూ వాడిందని, అంటే లబ్ధిదారులకు అందులో బిల్లుల రూపంలో వచ్చింది సుమారు సగమేనని, మిగతా దాదాపు రూ.2వేల కోట్ల ఇళ్ల నిధులు రాష్ట్రం ఇతర పథకాలకు మళ్లించింది అని స్పష్టం చేశారు.

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందని, ఇప్పటికే 25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను 30.76 లక్షల మందికి పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్లో రూ.5,661.57 కోట్లను కేటాయించి తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 10,11,006 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఇందులో 8,74,569 ఇళ్లు పునాది దశలో ఉండగా 81,467 ఇళ్లు పునాది దశను పూర్తి చేసుకున్నా, ఇప్పటికి పది శాతం కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు.

పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చే పక్షం రోజుల్లో (శ్రావణ మాసంలో) లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారని,  రాష్ట్రంలో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులు ముందుకు సాగడంలేదని శైలజానాథ్ ఆరోపించారు. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించిందని, వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించిందన్నారు.

అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొందని, ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లనే ఇప్పటికీ ప్రభుత్వం పంపిణీ చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇళ్ళు కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం ప్రారంభం