Publish Date: Tue, 12 Feb 2019 (21:10 IST)
Updated Date: Tue, 12 Feb 2019 (21:11 IST)
ప్రధాని మోడీ గుంటూరులో జరిగిన సభలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. అయితే... మోడీ విమర్శలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి స్వప్రయోజనాల కోసం రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రధాని మోడీ గద్దె దిగే సమయం ఆసన్నమైంది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రానికి చేసిన ద్రోహానికి తగిన బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురుచూసి మోసపోయాం. ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిపై మాట్లాడటం చరిత్రలో ఇదే మొదటిసారి.
మోడీ విమర్శలతోటే వారెంత భయపడుతున్నారో స్పష్టమవుతోంది. లోకసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మోడీకి ఎక్కువగా ఉంది. అందుకే దేశంలో ఆయనను ప్రశ్నిస్తున్న వారందరిపై దాడులు చేయిస్తున్నారు. నిన్న మోడీ పర్యటన తోటి బీజేపీ-వైసీపీ రెండు కలిసి పని చేస్తున్నాయని మరోసారి బయటపడింది అని నారా లోకేష్ అన్నారు.