Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొండ‌ప‌ల్లి ఖిల్లా ఆధునీక‌ర‌ణ ప‌నుల ఆక‌స్మిక త‌నిఖీ... ప‌నుల‌ జాప్యం

కొండ‌ప‌ల్లి ఖిల్లా ఆధునీక‌ర‌ణ ప‌నుల‌లో చోటుచేసుకున్న అల‌స‌త్వంపై ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కోట్లాది రూపాయ‌ల నిధులు కేటాయించి నెల‌లు గ‌డుస్తున్నా ఎటువంటి పురోగ‌తి లేక‌పోవ‌టాన్ని త‌ప్పుప‌ట్

కొండ‌ప‌ల్లి ఖిల్లా ఆధునీక‌ర‌ణ ప‌నుల ఆక‌స్మిక త‌నిఖీ... ప‌నుల‌ జాప్యం
, శుక్రవారం, 15 జూన్ 2018 (20:03 IST)
కొండ‌ప‌ల్లి ఖిల్లా ఆధునీక‌ర‌ణ ప‌నుల‌లో చోటుచేసుకున్న అల‌స‌త్వంపై ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కోట్లాది రూపాయ‌ల నిధులు కేటాయించి నెల‌లు గ‌డుస్తున్నా ఎటువంటి పురోగ‌తి లేక‌పోవ‌టాన్ని త‌ప్పుప‌ట్టారు. ఇక్క‌డి ప‌నులు పురావ‌స్తు శాఖ నేతృత్వంలో జ‌రుగుతుండ‌గా, ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఇంజ‌నీరింగ్ అధికారులను, కాంట్రాక్ట‌ర్‌ను తీవ్రంగా మంద‌లించారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ముఖేష్ కుమార్ మీనా కృష్ణా జిల్లా ప‌రిధిలోని కొండ‌ప‌ల్లి కోట‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఇక్క‌డ రూ.7.4 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో వివిధ ర‌కాల ప‌నులు చేప‌ట్ట‌గా, అవి న‌త్త‌న‌డ‌క‌న సాగ‌టంపై మీనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సంబంధించిన అధికారులు సోమ‌వారం 11 గంట‌ల‌కు పూర్తి స‌మాచారంతో స‌చివాల‌యానికి హాజ‌రు కావాల‌ని అదేశించారు.
 
ఇప్ప‌టికే ప‌నులు ప్రారంభించి ఐదు నెల‌లు కాగా, నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌రో నాలుగు నెల‌ల్లో ప‌నులు పూర్తి కావ‌ల‌సి ఉంది. కాని ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 20 శాతం ప‌నులు మాత్ర‌మే పూర్తి కావ‌టాన్ని మీనా త‌ప్పుప‌ట్టారు. మ‌రోవైపు ఎంతో చారిత్ర‌క ప్రాధాన్యం ఉన్న ఈ కోట‌లో ఇష్టానుసారం నిర్మాణాలు చేయ‌టాన్ని ఆక్షేపించారు. కోట గోడ వెంబ‌డి లోప‌లి వైపున నిర్శించిన శౌచాల‌యాల‌ను కూల్చివేయాల‌ని, కోట అందాన్ని వాస్త‌విక‌త‌ను దూరం చేసేలా ఏర్పాటు చేసిన చెత్త‌కుండీల‌ను తొలిగించి మ‌రోచోట నిర్మాణం చేయాల‌న్నారు. 
 
సంద‌ర్శ‌కులు కోటను సంద‌ర్శించేందుకు వ‌చ్చే ప్ర‌ధాన మార్గం ఇరుకుగా ఉండ‌టంతో దానిని వెడ‌ల్పు చేయాల‌ని, అక్క‌డ సాధ్యం కాకుంటే మ‌రోచోట ప్ర‌ధాన ద్వారాన్ని నిర్మించి త‌ద‌నుగుణంగా టిక్కెట్ కౌంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ప‌నుల ఆల‌స్యానికి సంబంధించి అక్క‌డ ఉన్న గుత్తేదారు ప్ర‌తినిధిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప‌నివారిని పెంచి వెంట‌నే ప‌నులు పూర్తి చేయాల‌ని, ఇక‌పై ప్ర‌తి 15 రోజుల‌కు వ‌స్తాన‌ని, మార్పు క‌నిపించాల‌ని హెచ్చ‌రించారు.
 
రూ.7.4 కోట్ల‌తో ద‌ర్బార్ హాల్ ఆధునీక‌ర‌ణ‌, మ్యూజియం ఏర్పాటు, అంత‌రించిపోతున్న కోట శిధిలాల పున‌ర్ నిర్మాణం వంటివి చేప‌ట్ట‌వ‌ల‌సి ఉండ‌గా, ఈ కోటను కాపాడుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన నిధుల‌ను స‌మ‌కూర్చేందుకు సిద్దంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా మీనా అన్నారు. ఇప్ప‌టికే మంజూరు చేసిన నిధులే కాకుండా భ‌విష్య‌త్తులో కూడా నిధుల కొర‌త లేకుండా చూస్తామ‌న్నారు. మ‌రోవైపు జాతీయ ర‌హ‌దారి నుండి కొండ‌కు దారితీసే మార్గంలో అట‌వీశాఖ‌తో మాట్లాడి ఒక ప‌ర్యాట‌క విడిది కేంద్రాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై అధికారుల‌తో మీనా చ‌ర్చించారు. ప‌ర్యాట‌కుల రాక‌పోక‌లు వ‌స‌తుల ఏర్ప‌టుతో ముడిప‌డి ఉంటాయ‌ని త‌ద‌నుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ పరువును నడిరోడ్డుపై లాగేస్తున్న జనసేన నేతలు..