Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు కట్టడాలతో రాజధానిలో ఊపిరితిత్తుల వ్యాధి.. బుగ్గన రాజేంద్రనాథ్

చంద్రబాబు కట్టడాలతో రాజధానిలో ఊపిరితిత్తుల వ్యాధి.. బుగ్గన రాజేంద్రనాథ్
, బుధవారం, 17 జులై 2019 (19:31 IST)
"ఏపీ రాజధాని అమరావతిలో పలువురికి ఊపికితిత్తుల వ్యాధి సోకుతోంది. . ఊపిరాడక పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే చంద్రబాబు తాత్కాలిక రాజధాని పేరిట నిర్మించిన భవనాలకు కిటికీలు లేవు. ఎక్కడా కిటికీలు కనిపించవు. అందువల్ల  ఉద్యోగులు, ఇతరులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. నెలకోసారి ఆసుపత్రులకు వెళ్ళాల్సి వస్తోంది" అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అసెంబ్లీలో బడ్జెట్ పై మూడు రోజుల చర్చకు బుధవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానమిస్తూ... "అమరావతి రాజధానిపై గ్రాఫిక్స్ చూపి ప్రజలను మభ్యపెట్టారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మలేషియా, సింగపూర్, శ్రీ లంక, లండన్, అమెరికా దేశాలలో కలియదిరిగారు. ఆయనతో పాటు అప్పటి ఆర్థికమంత్రి యనమల కూడా విదేశీ పర్యటనలలో పాల్గొన్నారురు. ప్రతి విదేశీ పర్యటనలో వీరిద్దరూ కలిసి తిరిగారు.
 
ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించి చివరకు దర్శకుడు రాజమౌళితో డిజైన్లు వేయించారు. రాజధాని పనుల కోసం కేంద్రం రూ 1500 కోట్లను విడుదల చేయగా ఏపీ కేవలం  277 కోట్లను తన బడ్జెట్ నుంచి విడుదల చేసింది. ఈ పనుల కోసం రూ 1770 కోట్లు ఖర్చు పెట్టారు. అంతర్జాతీయ స్థాయి అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు డబుల్ రోడ్లను కూడా నిర్మించలేకపోయారు. నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల కట్టడాలలో బయట కంటే లోపలే వర్షపు నీరు ఎక్కువగా కనిపిస్తుంది.  
 
నీరు చెట్టు పథకం కింద ముందు వెనుకా చూడకుండా నిధులను వెచ్చించారు. అయిదు సంవత్సరాల కాలంలో బడ్జెట్ కేటాయింపుల కంటే ఖర్చు ఎక్కువ. ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు నాకేశారు. నీరు చెట్లు పథకం కింద రూ 736 కోట్లకు గాను రూ 4850 కోట్లు వెచ్చించారు. అధికారం నుంచి వైదొలగిన ఏట ఈ పథకానికి రూ161 కోట్లు కేటాయించారు. బకాయిలు సుమారు 1183 కోట్లు మేర ఉన్నాయి. ఘోరాతి ఘోరంగా పాలన సాగించి తన మద్దతుదారులకు ప్రజాధనాన్ని కట్టబెట్టారు. ఈ పథకం వల్ల ప్రయోజనం మాత్రం సున్నా. 
 
వడ్డీ లేని రుణాలకు ఈ ఏడాది బ్జడెట్లో అతి తక్కువ నిధులు కేటాయించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ లో ఈవడ్డీ లేని రుణాలను చెల్లించాలి. వచ్చే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తాం. రైతులకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కలిస్తాం. గత అయిదు సంవత్సరాలలో ఈ పథకం కోసం చంద్రబాబు రూ 11,595 కోట్లకు గాను కేవలం 629 కోట్లు విడుదల చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని వేలెత్తిచూపుతున్నారు.
 
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్టు షాపులను బంద్ అయ్యేలా చూసింది. రెండోదశలో మధ్యం షాపులను ప్రభుత్వమే నడిపిస్తుంది. ఇప్పటిదాకా ప్రయివేటు వ్యక్తులు వీటిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలను చేపట్టడం వల్ల బెల్టు షాపులు లేకుండా చూడ వచ్చనేది ప్రభుత్వ అభిప్రాయం. చివరగా మద్యంపై నిషేదాన్ని అమలు చేస్తాం. దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 
 
రైతులకు మా ప్రభుత్వం చేయూతనిస్తోంది. పగలే 9 గంటల విద్యుత్తును వ్యవసాయ రంగానికి అమలు చేయాలని విధాన నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రస్తుతం 60 శాతం ప్రాంతాలకు ఈ మేరకు కరెంటు ఇస్తున్నాం. పంటల బీమా కోసం రూ 1160 కోట్లు, రైతు భరోసా కోసం రూ 8750 కోట్లు కేటాయించాం. దీని వల్ల నిరుపేద రైతులతో పాటు కౌలు రైతులకు ఉపకారం ఒనగూరుతుంది.
 
యువత, టూరిజంకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయట వారికి. ఈ పద్దు కింద గత ప్రభుత్వం గత ఏడాది రూ 2063 కోట్లను కేటాయించి కేవలం రూ 603 కోట్లను వెచ్చించింది. ఈ ఏడాది బడ్జెట్ రూ 538  కోట్లు. తేడా గమనించిండి. విశాఖ కోకో మ్యాచ్ చూస్తూ 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ విధంగా మాటలు చెప్పబోం. కోతల ప్రభుత్వం మాది కాదు. 
 
అమరావతి రాజధాని ప్రాంతంలో కంప చెట్టుండగా పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చాయని టీడీపీ ప్రచారం చేసుకుంది. ఆ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదు. గత ఏడాది రాయితీల కింద బడ్జెట్లో రూ 3500 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు పెట్టింది రూ 740 కోట్లు మాత్రమే ఐటీ పరిశ్రమలు  అడుగంటిపోయాయి. ఐటీలో కంప్యూటర్లను కనిపెట్టిన చంద్రబాబు ఈ రంగానికి చేసిందేమీ లేదు. 
 
అట్టడుగున ఉన్న నిరుపేదలను ఆదుకోవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. మానవ వనరుల ప్రగతికి తగిన చర్యలు 
తీసుకుంటున్నాం. అమ్మ ఒడి పథకంకు రూ 6,600 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుకు  రూ 4 వేల కోట్లు, పాఠశాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ 1500 కోట్లు కేటాయించాం. టీడీపీ హయాంలో ఈ రంగాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు జరిగింది. ఏపీలోని ఆపన్నులలో మొత్తం 80 శాతం ప్రజలను ఆదుకునే పథకాలను ఈ ఏడాదే మొదలు పెట్టాం. 
 
పశువులకు బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉంది. గొర్రెలకు బీమా సదుపాయం ఇప్పటి దాకా లేదు. గొర్రెల బీమా నిధులను మా ప్రభుత్వం విడుదల చేస్తుంది. హౌసింగ్ బడ్జెట్‌ను రూ 3500 కోట్ల నుంచి రూ 8,500 కోట్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ లో ప్రతి జబ్బుకు ఉచిత చికిత్స ఉంటుంది. పింఛన్ల కోసం రూ 15 వేల కోట్లు కేటాయించాం. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పింఛన్న రూ. 2 వేలకు పెంచారు. మా ప్రభుత్వం ప్రతి నెలా రూ 2,250 పింఛన్ ను నిరుపేదలకు ఇస్తోంది. 
 
చంద్రబాబు తన హయాంలో దోమలపై దండయాత్ర ప్రకటించారు. కర్నూలు సర్కిల్ రోడ్డులో చంద్రబాబు కట్ అవుట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు తలపై కిరీటం పెట్టి చేతిలో కత్తి ఉండేలా... దోమ చిత్రం చిన్నగా కనిపించేలా కటౌటు  పెట్టారు. ఇది చూసి ప్రజలు నవ్వుకున్నారు. దోమలపై దండయాత్ర అంటూ చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు  కూడా గొప్పగా ఉన్నాయి. నీరు..చెట్లు, వనం ..మనం, మీ ఇంటికి మీ భూమి, హ్యాపీ సండే, జల హారతి, దోమలపై దండయాత్ర లాంటి పేర్లు చూస్తే మాటర్ వీక్..పబ్లిసిటీ పీక్ అని చెప్పవచ్చు.
 
గత ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు మోసం చేశారు. రూ 87 వేల కోట్లకు గాను రూ 24 వేల కోట్లను విడుదల చేశానని ప్రకటించి  రూ. 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారు. చివరకు తన ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్లో దీనికి నిధులను కేటాయించ లేదు. నాలుగు, అయిదో విడత రుణ మాఫీ బకాయిలు రూ 7925 కోట్లు. నాలుగో విడత కింద రూ.  3600  కోట్లు, అయిదో విడత కింద రూ 4325 కోట్లు పెండింగులో ఉన్నాయి. 
 
మా ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగే అవకాశం లేదు. ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రజలపై భారాన్ని మోపబోము. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫిస్కల్ లోటు ప్రతి ఏడాది నమోదు అయ్యింది. ఫిస్కల్ లోటు 3.58 శాతం ఉండాలి. ప్రతి ఏడాది ఎఫ్ఆర్ బీఎం లక్ష్మణ రేఖను చంద్రబాబు దాటి అప్పులు చేశారు. 2016.17లో దీనిశాతం 4.42 , 2017.18లో 4.07 శాతం నమోదైంది. మా ప్రభుత్వ హయాంలో ఈీశాతం 3.26 శాతం లోగానే ఉంటుంది. అందువల్ల అప్పు పెరిగే ప్రమాదం లేదు. మాది సంక్షేమ ప్రభుత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను ఆదుకునే సర్కారు" అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీని వదిలేస్తున్నా... కాపుల కోసం పని చేస్తానంటున్న నటి హేమ