Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ల‌క్ష కుంకుమార్చ‌న‌

పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ల‌క్ష కుంకుమార్చ‌న‌
విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (16:53 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. దీనిని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన ఈ సేవ‌లో వ‌ర్చువ‌ల్‌ విధానం ద్వారా 413 మంది గృహ‌స్తులు త‌మ ఇళ్ల నుండే పాల్గొన్నారు.
 
 
హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష‌ ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. ల‌క్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.
 
 
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం మీడియాతో మాట్లాడుతూ, బ్ర‌హ్మోత్స‌వాల ముందు రోజు ల‌క్ష కుంకుమార్చ‌న సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో  బ్ర‌హ్మోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఈ ఉత్స‌వాలు దిగ్విజ‌యంగా జ‌ర‌గాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలల సంక్షేమ కమిటీల‌కు జువెనైల్ చట్టాలపై అవగాహ‌న స‌ద‌స్సు