Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

తితిదే ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
, శనివారం, 10 అక్టోబరు 2020 (23:37 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్యనిర్వహణాధికారిగా కేఎస్ జవహర్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ఏవి ధర్మారెడ్డి ఈ మేరకు నూతన ఈవోకు బాధ్యతలు అప్పగించారు.

అనంతరం టిటిడి బోర్డు సభ్యకార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఈ మేరకు ప్రమాణం చేయించారు. నూత‌న ఈవో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు.

ఆ తర్వాత ధర్మారెడ్డి నూత‌న ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని నూతన ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఉదయం అలిపిరి మార్గంలో కాలినడకన జవహర్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు.

శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం రావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని, చాలా సంతోషంగా ఉంద‌ని నూత‌న ఈవో కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. ఒక భ‌క్తుడిలా స్వామివారికి సేవ చేయాల‌ని చాలాకాలంగా అనుకుంటున్నాన‌ని చెప్పారు. తిరుప‌తిలో తాను వెట‌ర్న‌రీ సైన్సు విద్య‌ను పూర్తి చేశాన‌న్నారు.

భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఇప్పుడున్న వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేసేందుకు కృషి చేస్తాన‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈఓ పి.బసంత్‌కుమార్, జెఈఓ(విద్య మరియు ఆరోగ్యం) ఎస్.భార్గవి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, బోర్డు స‌భ్యులు శివ‌కుమార్‌, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డెప్యూటి ఈవో ఆర్-1 బాలాజి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీనేతల కోసం ప్రత్యేకంగా ‘జగనన్న జేబు కత్తెర’: టీడీపీ