Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి అమవాస్యకు ముందు ఓ వెలుగు రేఖ : ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఒకే

దీపావళి అమవాస్యకు ముందు ఓ వెలుగు రేఖ : ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఒకే
, శనివారం, 26 అక్టోబరు 2019 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఒక్క విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై చర్చలు జరిపేందుకు తెరాస సర్కారు సమ్మతించింది. నలువైపుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు. 
 
ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటలకు బస్‌ భవన్‌లో ఈ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ తదితర 26 డిమాండ్లతో కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు ధర్మాసనం సూచించింది.
 
ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని నిర్దేశించింది. దాంతో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఈడీలు, ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌తో ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు రోజులుగా డిమాండ్లపై అధ్యయనం చేసింది. 
 
వీటిలో ప్రభుత్వం, యాజమాన్యం పరిధుల్లోకి వచ్చే సమస్యలను విభజించింది. ఆర్థిక చిక్కులున్న సమస్యలు, వాటితో పడే ఆర్థిక భారం తదితర వివరాలను సేకరించింది. ఈ వివరాలతో కూడిన పూర్తి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో భేటీ అయి నివేదికను అందజేసింది. 
 
ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సమీక్షలో తేల్చారు. 
 
హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు. వీటిపై కార్మిక జేఏసీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. చర్చల సందర్భంగా, కార్మిక సంఘాలు సూచించే ఇతర డిమాండ్లనూ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్యానాలో డీల్ ఫిక్స్ : బీజేపీ - జేజేపీ సంకీర్ణ సర్కారు... అమిత్ షా