Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడపను చూస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకని?

కడపను చూస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకని?
, సోమవారం, 25 జనవరి 2021 (22:08 IST)
కడప నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు. సోమవారం 46వ డివిజన్ అక్కాయపల్లెలో 62.50 లక్షలతో మంజూరైన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్బాష, మాజీ మేయర్ సురేష్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.
 
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు పేదల ముంగిటకు చేయడం జరుగుతుందన్నారు. అవ్వాతాతలకు ప్రతి నెల ఒకటవ తేదీన వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు.
 
 
భారత దేశ చరిత్రలో ఎవరూ కని విని ఎరుగని రీతిలో  రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. కడప నగరంలో 23,500 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ఇంకా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతుందని అర్హులు అందరూ వెంటనే సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమవుతుందని రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రివర్యులకు సహకరించాలన్నారు.
 
 
రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. కడప పట్టణంలో ఒక క్యాన్సర్ ఆస్పత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, మెంటల్ ఆసుపత్రి నిర్మించి ఈ ప్రాంత వాసులకు అన్ని రకాల వైద్య సేవలు పట్టణంలో కల్పించడం జరుగుతుందన్నారు.
 నగరంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి 12 జిఎల్ఎస్ఆర్‌లు నిర్మాణంలో ఉన్నాయని ఇవి పూర్తయిన తర్వాత 24 గంటలు నగరంలో మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
 
పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండటంతో రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఇందుకు ప్రజలు అందరూ సహకరించాలన్నారు. బుగ్గవంక సుందరీకరణకు సంబంధించి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రొటెక్షన్ వాల్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుందన్నారు. పాత కడప చెరువును హైదరాబాద్ ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గత ఐదేళ్ల పాలనలో కడప నగర అభివృద్ధికి సంబంధించి ఎవరూ పట్టించుకోలేదని మన జిల్లా ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో జిల్లా రూపురేఖలు మార్చడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రివర్యులకు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీదేవి, 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ,31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, వైయస్ఆర్ సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, యానాదయ్య, ఎంవి రామచంద్రారెడ్డి, ఎల్. నాగ మల్లారెడ్డి, నాగిరెడ్డి, నగర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు అహ్మద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా.. 56మందికి కోవిడ్ పాజిటివ్.. ఏడు నెలల్లో..?