Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేసీ తిట్ల పురాణం.. జగన్ పార్టీ కౌంటర్ పర్వం

వేదిక దొరికితే, దానికి కాస్త మైకు తోడయితే ఇక ఆయనకు పట్టపగ్గాలుండవు. తాను ఎందుకు మాట్లాడుతున్నాడో, దేనికి మాట్లాడుతున్నాడో, అవతలి పోస్టుకు గోల్ పంపుతున్నాడో, లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడో తెలీని స్థితిలోకి వెళ్లే చరిత్ర టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్

జేసీ తిట్ల పురాణం.. జగన్ పార్టీ కౌంటర్ పర్వం
హైదరాబాద్ , శనివారం, 14 జనవరి 2017 (03:44 IST)
వేదిక దొరికితే, దానికి కాస్త మైకు తోడయితే ఇక ఆయనకు పట్టపగ్గాలుండవు. తాను ఎందుకు మాట్లాడుతున్నాడో, దేనికి మాట్లాడుతున్నాడో, అవతలి పోస్టుకు గోల్ పంపుతున్నాడో, లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడో తెలీని స్థితిలోకి వెళ్లే చరిత్ర టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిది. తన నోటి దురుసుతనం సొంత పార్టీని కూడా వదలకుండా జాడించేసరికి ఉంటే ఉండు పోతే పో అని చంద్రబాబు ఆగ్రహం కూడా చవిచూసిన జేసీ  పులివెందులలో చంద్రబాబు సాక్షిగా కుప్పిగంతులు వేశారు.
 
అది కాస్తా పరాకాష్టకు పోయి వాడెవడు, వీడెవడు, నాకంటే మించిన రెడ్డెవడు అంటూ కాస్త శ్రుతిమించినా చంద్రబాబు వద్ద మార్కులు మాత్రం కొట్టేశారు జేసీ. అయితే ఎంపీ స్థాయిని కూడా మరిచి నిండు సభలో జేసీ వ్యవహరించిన తీరు స్వపక్షంలోనే చాలామందికి వెగటు పుట్టించింది.
 
కానీ జేసీ తిట్లపురాణం వైకాపాలో ఈసారి కాస్త ఎక్కువగానే సెగపుట్టించినట్లుంది. పులివెందులకు వచ్చి అధినేత జగన్‌ను చీమలాగా తీసిపారేయడం, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డిని వాడూ వీడూ అంటూ సత్కరించడంతో వైకాపా నేతలకు నసాళానికి అంటింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ బఫూన్, జోకర్‌ అని, మతి భ్రమించి చిల్లర నాయకుడిలా, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 
 
పైగా గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో వేలమంది పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య జేసీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం పెద్ద గొప్పేం కాదని... దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా కడపకుగానీ,  పులివెందులకు గానీ వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. చెంచాలు వైఎస్‌ను తిడుతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందాడని ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. జేసీ దివాకర్‌రెడ్డి సభ్యత, సంస్కారం మరిచి రోడ్డుపై చిల్లర వాళ్లు మాట్లాడే భాష ఉపయోగించారని దుయ్యబట్టారు.
 
పనిలోపనిగా జేసీ పైన ఉన్న కోపాన్ని టీడీపీ అధినేతపైకి కూడా మళ్లించారు వైకాపా నేతలు, కృష్ణా జలాలు సీమ జిల్లాలకు రావడంలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని.. సీమలోని అన్ని ప్రాజెక్టులనూ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడో పూర్తి చేశారని తెలిపారు. గేట్లు ఎత్తి తానే పనులన్నీ చేశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. 
 
బురద చల్లడం చల్లించుకోవడం అలవాటైపోయిన రాజకీయాలు కదా. జేసీ బురద జేసీది, వైకాపా బురద వైకాపాది. అందరికీ తలా కాస్త అంటించడమే దాని లక్షణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక అంతర్జాతీయ ఉచిత వైఫై.. 100 దేశాల్లో 4,4 కోట్ల బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్లు