Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోషకాహారం, రక్తహీనత నివారణ కోసం భారీగా నిధులు: డాక్టర్ కృతికా శుక్లా

పోషకాహారం, రక్తహీనత నివారణ కోసం భారీగా నిధులు: డాక్టర్ కృతికా శుక్లా
, గురువారం, 11 జూన్ 2020 (18:32 IST)
మహిళలు, 6-72 నెలల పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపాలను అధికమించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖకు భారీగా నిధులు పెంచాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం అమలులో ఉన్న వైఎస్ఆర్ అమృత హస్తం, మధ్యాహ్న భోజనం, బాలామృతం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, బాల సంజీవిని పథకాలను అన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకు వస్తూ ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ’ ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలను నూతనంగా ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశం అంగీకరించిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ, వయో వృద్దుల, విభిన్న ప్రతిభావంతుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

2018-19 లో రూ.762 ,  2019-20 లో రూ.1076 కోట్లను వ్యయం చేయగా, ప్రస్తుతం బడ్జెట్ ను రూ.1863.11 కోట్లకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనకు సైతం మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాంతాలలో (ఐటిడిఎ) ఉన్న 77 గిరిజన, సబ్ ప్లాన్ మండలాలలోని 52 ఐసిడిఎస్ ప్రాజెక్టు లను కలుపుతూ 8,320 అంగన్ వాడీ కేంద్రాలలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

66,000 మంది గర్భిణీలు, బాలింతలకు రూ.87.12 కోట్ల ఖర్చుతో నెలకు 25 రోజుల పాటు అంగన్ వాడీ కేంద్రాలలో భోజనం అందిస్తామన్నారు. భోజనంతో పాటు ప్రతీ నెలా ఇంటికి ఇచ్చే పోషకాహార కిట్ లో  రెండు కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా , అరకిలో వేరుశెనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరాలు గ్రామలు ఉంటాయన్నారు.

36-72 నెలల వయసు కల 1,64,000 మంది పిల్లలకు Rs.108.83 కోట్ల వ్యయంతో అంగన్ వాడీ కేంద్రాలలో భోజనం వడ్డిస్తారన్నారు. ఆరు నుండి 36 నెలల వయస్సు కలిగిన పిల్లలకు రూ.111.60 కోట్ల వ్యయం తో ప్రతీ నెలా ఇంటికి ఇచ్చే పోషకాహార కిట్ లో భాగంగా నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడిగుడ్లు, ఆరు లీటర్ల పాలు పాలు పంపిణీ చేస్తామని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. ఈ క్రమంలో 3.80 లక్షల మంది కోసం రూ. 307.55 కోట్లు వ్యయం చేయనున్నామన్నారు.
 
77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని మండలాలలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయనుండగా, రాష్ట్రంలోని  47,287 అంగన్ వాడీ కేంద్రాలలోని గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషణ పరంగా లబ్ది చేకూరనుందని సంచాలకులు పేర్కొన్నారు.

5,80,000 మంది గర్భిణీలు, బాలింతలకు రూ. 591.60 కోట్ల వ్యయంతో అంగన్ వాడీలలో నెలకు 25 రోజుల పాటు పూర్తిగా వండి పెట్టే భోజనంతో పాటు ప్రతి నెల ఇంటికి పోషకాహార కిట్ ను సైతం అందిస్తామన్నారు. 36 నుండి 72 నెలల వయస్సు కలిగిన 7,06,000 మంది పిల్లల కోసం రూ. 296.52 కోట్ల వ్యయంతో అంగన్ వాడీ కేంద్రాలలోనే భోజనం అందించటం జరుగుతుందన్నారు. 

ఆరు నుండి 36 నెలల 13.50 లక్షల మంది చిన్నారులకు ప్రతి నెల రూ. 667.44 కోట్ల వ్యయంతో ప్రతీ నెలా ఇంటికి ఇచ్చే పోషకాహార కిట్ లో  రెండున్నర కిలోల బాలామృతం, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు  అందిస్తామని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. మొత్తంగా  26,36,000  మంది కోసం రూ. 1555.56 కోట్లు వ్యయం చేయనున్నామన్నారు.

అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమాలకు, నూతనంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలకు పలు వ్యత్యాసాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి అమలుకు రూ.1360.75 కోట్లు ఖర్చు చేస్తుండగా,  అదనంగా రూ.502.36 కోట్లు జతచేస్తూ మొత్తం రూ.1863.11 కోట్లను పోషకాహారం కోసం ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

గర్భిణీ, బాలింతలలో కేవలం రక్తహీనత ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ విడత గర్భిణీ, బాలింతలు అందరికీ పోషకాహార కిట్ ను ఇంటికి ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగిందన్నారు. గతంలో బాల సంజీవిని కార్యక్రమం కింద కేవలం రక్తహీనతతో ఉన్న గర్భిణీ, బాలింతలకు మాత్రమే పోషకాహార కిట్ ఇచ్చేవారు. గర్భిణీ, బాలింతలకు అంగన్ వాడీ కేంద్రాలలో వండి పెట్టే భోజనంలో ఇంతకుముందు ప్రతి రోజు 50 గ్రాములు కూరగాయలు ఉండేవి.

రక్తహీనతను నివారించే క్రమంలో అలాగే ఐరన్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నిత్యం 125 గ్రాముల ఆకుకూరలు ఉండేలా నిర్ణయించడం జరిగింది. 36-72 నెలల పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనంలో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే అనునిత్యం ఇచ్చే 25 గ్రాముల కూరగాయలను 42 గ్రాములకు పెంచడం జరిగింది.

బాల సంజీవిని కార్యక్రమం ద్వారా కేవలం పోషకాహార లోపంతో ఉన్న షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రాంతాల లోని  అంగన్ వాడీ కేంద్రాలలో మాత్రమే పిల్లలకు గుడ్డు, పాలు ఇచ్చే వారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన 36-72 నెలల పిల్లలందరికీ పోషణ స్థితితో సంబంధం లేకుండా ప్రతిరోజు 100 మిల్లి లీటర్ల పాలు, ఒక గుడ్డు 25 రోజులకు ఇవ్వాలని నిర్ణయించారు.

6-36 నెలల పిల్లలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నెలకు 25 గుడ్లు, 2.5 లీటర్ల పాలు ఇవ్వనుండగా గతంలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ఆవాసాలలోని అంగన్ వాడీ కేంద్రాలలో మాత్రమే ఈ సదుపాయం ఉండేది. మిగిలిన ప్రాంతాలలో ఉండే పిల్లలకు కేవలం నెలకు 8 గుడ్లు మాత్రమే అందేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ గుడ్లు, పాలు అందించాలని నిర్ణయించింది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న పోషక ఆహార కార్యక్రమాన్ని పరిశీలిస్తే రక్తహీనత ఉన్న గర్భిణీ బాలింతలు,  పోషకాహార లోపంతో ఉన్న పిల్లలు,  సాధారణ పోషణ స్థితిలో ఉన్న మహిళలు, పిల్లలు... ఇలా భిన్నమైన రీతిలో ఉన్నాయి. 

ఈ నేపధ్యంలో రక్తహీనత, పోషకాహార లోపాలను రూపుమాపేందుకు  ఐరన్, ప్రోటీన్, శక్తినిచ్చే ఆహారాన్ని అందరూ గర్భిణీ, బాలింతలకు అందించటంతో పాటు 6-36, 36-72 నెలల వయసు పిల్లలందరికీ ఒకే రకమైన పోషకాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్  సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుందని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.  పోషకాహార లోపాన్ని రక్తహీనతను రూపుమాపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌