Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంటనే ఎన్నికలు జరపండి: కృష్ణంరాజుకు 15 మంది ఈసీ సభ్యుల లేఖలు

వెంటనే ఎన్నికలు జరపండి: కృష్ణంరాజుకు 15 మంది ఈసీ సభ్యుల లేఖలు
, బుధవారం, 28 జులై 2021 (03:01 IST)
ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ‘

‘మేమందరం 2019, మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021, మార్చితో ముగిసిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ‘మా’ ఒక ఎన్నికైన కార్యవర్గం లేకుండానే ఉంది. తాము ఎన్నికయిన కార్యవర్గమని చెప్పుకోవటానికి ప్రస్తుత కమిటీకి ఎటువంటి నైతిక హక్కు లేదు.. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడిగా.. ‘మా’లో సీనియర్‌ సభ్యుడిగా – మీరు పగ్గాలు చేపట్టండి.

తక్షణమే ఎన్నికలు నిర్వహించండి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలను సక్రమంగా, సజావుగా నిర్వహించటంలో తమ పూర్తి సహకారం ఉంటుందని కూడా వెల్లడించారు.
 
‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ప్రస్తుతం 24 మంది సభ్యులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. సాధారణంగా ఈ కమిటీ సమావేశానికి అధ్యక్షుడు నరేష్‌ అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే నరేష్‌ బదులుగా క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో ఎన్నికలు సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఈసీ సభ్యులు లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలపై అభిప్రాయం తెలపమని మా అధ్యక్షుడిని.. క్రమశిక్షణా సంఘం సభ్యులను కృష్ణంరాజు కోరే అవకాశముంది. వారి అభిప్రాయం మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరీ బసవరాజ్ బొమ్మై?