Publish Date: Wed, 17 Mar 2021 (16:24 IST)
Updated Date: Wed, 17 Mar 2021 (16:25 IST)
రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియామకంపై సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. నియామక కమిటీకి సీఎం జగన్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ , హోంమంత్రి, మండలి, శాసనసభ ప్రతిపక్ష నేతలు ఉన్నారు. మండలి చైర్మన్ షరీఫ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంమంత్రి సుచరిత సమావేశానికి హాజరవగా... ఉభయ సభల విపక్ష నేతలు చంద్రబాబు, యనమల సమావేశానికి గైర్హాజరయ్యారు.
మరోవైపు సచివాలయానికి సీఎం జగన్ రాక సందర్భంగా మందడం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతుల దీక్ష శిబిరం వద్ద రైతులు వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. అయితే శిబిరం ముందు నిలబడి సీఎం వెళ్లే వరకు రైతులు అమరావతి నినాదాలు చేశారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుగోడగా నిలిచారు.