Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటికి ఘనంగా వీడ్కోలు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటికి ఘనంగా వీడ్కోలు
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి. తెలంగాణా రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ లలిత కన్నెగంటికి రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు ఇతర న్యాయమూర్తులు తదితరులు జస్టిస్ లలిత కన్నెగంటికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పికె మిశ్రా మాట్లాడుతూ. గుంటూరు జిల్లాకు చెందిన జస్టిస్ లలిత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాపొంది 1994లో న్యాయవాదిగా నమోదై వివిధ హోదాల్లో పనిచేసిన తదుపరి 2021 మేనెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వ‌చ్చార‌న్నారు. గత ఏడాది కాలానికి పైగా రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లలిత కన్నెగంటి అందించిన సేవలను కొనియాడారు. ఈ కాలంలో సుమారు 12వేలకు పైగా కేసులను జస్టిస్ లలిత విచారణ చేశారని, వాటిలో సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులను అధికంగా పేర్కొన్నారు. తెలంగాణా  హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ లలిత భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పికె మిశ్రా పేర్కొన్నారు.
 
 
తెలంగాణా హైకోర్టుకు బదిలీపై వెళుతున్న జస్టిస్ లలిత కన్నెగంటి మాట్లాడుతూ, ఇక్కడ న్యాయమూర్తిగా తన పదవీ కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎకె గోస్వామి, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల వద్ద పని చేసే అవకాశం కలిగింద‌న్నారు. అనేక అంశాలను వారి నుండి తెల్సుకునే అదృష్టం కలిగిందని పేర్కొన్నారు. న్యాయస్థానం కీర్తి బార్ పై ఆధారపడి ఉంటుందని, ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ బార్ ఉత్తమమైనదిగా ఉందని కొనియాడారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తన పదవీ కాలంలో చాలా వరకూ కేసులన్నిటినీ వర్చువల్ విధానంలోనే విచారించడం జరిగిందని జస్టిస్ లలిత కన్నెగంటి పేర్కొన్నారు. సబ్ జుడీషియరీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని జస్టిస్ లలిత చెప్పారు. న్యాయమూర్తిగా ఇక్కడ తనకు సహకరించిన గత ప్రధాన న్యాయమూర్తులు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, సహచర న్యాయమూర్తులు సహా ఇతర న్యాయాధికారులు, సిబ్బంది అందరికీ పేరు పేరున జస్టిస్ లలిత ధన్యవాదాలు తెలియజేశారు.
 
 
రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాధ్, ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకీ రామి రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లలిత కన్నెగంటి అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ వీడ్కోలు సభలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసి క్యూటర్,బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ బిఎస్ భానుమతి స్వాగతం పలికి వీడ్కోలు కార్యక్రమాన్నినిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు  ఎ.వేణుగోపాలరావు జస్టిస్ లలితకు జ్ణాపికను అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రో ప్రయాణికులకు శుభవార్త : ఉదయం 6 నుంచే మెట్రో సేవలు