Publish Date: Mon, 14 Oct 2024 (11:44 IST)
Updated Date: Mon, 14 Oct 2024 (11:55 IST)
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా క్యూ లైన్లలో ఉన్న భక్తులను షెడ్లలోకి అధికారులు తరలిస్తున్నారు.
వర్షంలో ఉండవద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపుతామని భక్తులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కూడా మరింత పెరిగింది. ఉదయం నుంచే వాతావరణం కాస్త చల్లబడింది. ఈ భారీ వర్షాలకు శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయం అయ్యాయి.
ఇకపోతే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి