ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం డివిజన్ కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్స్టేషన్ల పరిధిలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ బి.సుబ్బారావు విధులు నిర్వర్తిస్తున్నారు.
గత రెండేళ్లుగా ఆయన అక్కడ పనిచేస్తున్నారు. కామవరపుకోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో నివాసముంటున్నారు. శుక్రవారం బుట్టాయగూడెం నుంచి వచ్చి ఆరోజు రాత్రి విధులు నిర్వర్తించారు. అనంతరం సుబ్బారావు ఫోన్ సిగ్నల్ కట్ అయింది.
అప్పటి నుంచి అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ శనివారం సాయంత్రం కామవరపుకోట మండలం తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో కామవరపుకోటకు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుబ్బారావు ఫోన్ సిగ్నల్ ఆగిపోయిన ప్రాంతాలతో పాటు టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.